దేశ ప్రజలకు తీవ్ర ఆర్థిక భారంగా మారిన జీఎస్టీ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. జీఎస్టీ వ్యవహారాన్ని ప్రస్తావించారు. దేశ ప్రజలు జీఎస్టీ గురించి ఏమనుకుంటున్నారో.. తనకు వినిపిస్తోందన్నారు. దీనిపై ఉద్దీపనలు (రాయితీ) ప్రకటించనున్నామని ఆయన చెప్పారు. వచ్చే దీపావళి నాటికి.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు తీసుకురానున్నట్టు చెప్పారు. తద్వారా ప్రజలపై భారాలు తగ్గిస్తామన్నారు.
సామాన్యులకు కొత్త జీఎస్టీ సంస్కరణలను దీపావళి కానుకగా ఇస్తామని ప్రధాని ప్రకటించారు. అంతేకాదు.. వారిపై పన్నుల భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీంతో మార్కెట్లు పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. యువతకోసం.. ప్రధాని మరో కీలక పథకాన్ని కూడా ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించినట్టు మోడీ తెలిపారు. కొత్తగా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు పొందే వారికి.. నెలకు 15 వేల చొప్పున మూడేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్టు చెప్పారు.
తద్వారా కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకు వస్తాయన్నారు. దీనివల్ల ఉపాధి రంగం వృద్ధి చెందుతుందని వివరించారు. అదేసమయంలో స్వదేశీ వస్తువుల తయారీ, వినియోగానికి కూడా ప్రాధాన్యం పెంచుతున్నట్టు ప్రధాని తెలిపారు. తద్వారా దేశ అవసరాల కోసం.. పొరుగు దేశాలపై ఆధారప డాల్సిన అవసరం ఉండబోదన్నారు. ప్రతి రంగంలోనూ స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు. త్వరలో మేడ్ ఇన్ ఇండియా చిప్లు మార్కెట్ను ముంచెత్తుతాయని ప్రధాని చెప్పారు.
సెమీ కండక్టర్ల విషయంలో దేశం స్వయం సమృద్ధి సాధించిందన్న ప్రధాని మోడీ.. ప్రపంచదేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంటుందన్నారు. రాష్ట్రాలు కూడా స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంగా భారత్ అడుగులు పడుతున్నాయన్నారు. త్వరలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక స్థానానికి చేరుకుంటుందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates