కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠగా మారిపోయింది. రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్టుగా సాగుతోంది. ఈ క్రమంలో ఎవరికివారు ఈ ఎన్నికలో విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు దాడులు జరిగే అవకాశముందని సూచనలతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. వీరిలో వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ అవినాష్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఉన్నారు.
మంగళవారం తెల్లవారుజామునే అలెర్టయిన పులివెందుల పోలీసులు డీఎస్పీ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ ఇంటికి చేరుకుని ఆయన్ని మంచంపై నుంచే బయటకు తీసుకువచ్చారు. అయితే తాను ఫ్రెష్ అయి వస్తానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంలో ఎంపీ అవినాష్ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం, పెనుగులాట కూడా చోటుచేసుకుంది. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డిని బలవంతంగా పోలీసులు జీపులో ఎక్కించారు.
మరోవైపు పులివెందుల సహా ఒంటిమిట్ట జెడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా పోలీసులు చాలా మందిని గృహనిర్బంధం చేశారు. వీరిలో వైసీపీతో పాటు టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. వేంపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీశ్ రెడ్డిని, పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇదే సమయంలో మరికొందరిని బైండోవర్ చేశారు.
అయితే ఈ వ్యవహారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికలు సజావుగా సాగాలన్న ఉద్దేశంతోనే తాము అరెస్టులు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ నాయకులు మాత్రం ఉద్దేశపూర్వకంగా తమను అరెస్టు చేస్తున్నారని, ఎన్నికల ప్రక్రియను దారి మళ్లిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా ఉమ్మడి కడప జిల్లాలో ప్రస్తుతం రాజకీయాలు గరంగరంగా మారిపోయాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates