పులివెందులలో వైసీపీ ముందే చేతులెత్తేసిందా?

పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నికల్లో వైసీపీ ముందే చేతులెత్తేసిందా? గత నాలుగు దశాబ్దాలలో ఎప్పుడూ లేనంత ప్రతిఘటనను ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబం ఎదుర్కొంటుందా? అంటే పులివెందుల తాజా రాజకీయ వాతావరణం చూస్తుంటే అవుననే చెప్పాలి.

పులివెందుల జెడ్పిటిసికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ జెడ్పిటిసి పరిధిలో మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఏజెంట్లను బూత్‌లలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇతర నియోజకవర్గాల నుంచి వెళ్లిన టిడిపి కార్యకర్తలు పులివెందును ఆక్రమించారు. చివరికి వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారంటే అక్కడ అధికార పార్టీ ఏ స్థాయిలో మేనేజ్‌మెంట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ జెడ్పిటిసి ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి టిడిపి వాళ్లు అధికారం అడ్డం పెట్టుకుని అరాచకానికి తెరలేపారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఒక దశలో వైసీపీ ఎన్నికలను బహిష్కరిస్తుందని సొంత పార్టీ వాళ్లతో పాటు టిడిపి నాయకులు కూడా అనుకున్నారు. అయితే జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం కావడంతో తమ పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టారు.

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో పాటు ఇతర ముఖ్య నాయకులపై దాడి జరిగింది. అయినా వైసీపీ ఎక్కడా వెనక్కు తగ్గలేదు. చేతులు ఎత్తేయలేదు.

ఈ జెడ్పిటిసి పదవీకాలం మరో 10 నెలలు మాత్రమే ఉంది. దీనికోసం పులివెందులలో ఇంతటి అరాచకానికి పాల్పడటం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 15 పోలింగ్ బూత్‌ల పరిధిలో కనీసం వైసీపీ ఏజెంట్లను కూడా అడుగుపెట్టకుండా టిడిపి రాజకీయం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మూడుసార్లు ఎంపీగా గెలిచిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సైతం పోలీసులు ఈడ్చికెళ్లి జీపులో వేశారు. ఆయనను కడప తీసుకు వెళ్లారు. మరోవైపు టిడిపి రౌడీ మూకలు బూత్‌లు ఆక్రమించుకొని తమ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్ చేస్తున్నారని వైసీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు.

ఏది ఏమైనా పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నికల్లో వైసీపీని ఓడించామని చెప్పుకోవటంలో ఆ కిక్కే వేరని టిడిపి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. పోలింగ్‌కు ముందు పరిస్థితులు చూస్తుంటే వైసీపీ ముందే చేతులెత్తేసిందా అన్నట్టుగానే ఉంది.