వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తాజాగా మరో చార్జిషీట్ను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సమర్పించారు. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి గతంలోనే సుదీర్ఘ చార్జిషీట్ను అధికారులు సమర్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అనుబంధ చార్జిషీట్ను ఇచ్చారు.
దీనిలో అసలు నగదు ఎక్కడ నుంచి ఎలా వచ్చింది? ఈ నగదు చివరి లభ్ధిదారువరకు ఏయే మార్గాల్లో తరలింది? అనే కీలక విషయాలు వెల్లడించినట్టు తెలిసింది.
ఈ మొత్తం వ్యవహారంలో భారతీ సిమెంట్ సంస్థ ఆడిటర్ బాలాజీ గోవిందప్ప, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్కు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిల పాత్రను సిట్ అధికారులు సమగ్రంగా వివరించారు. ఈ ముగ్గురు ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్నారు. వీరి ద్వారానే నగదు అంతిమ లభ్ధిదారు (ఎవరనేది చెప్పలేదు) వరకు చేరిందని సిట్ పేర్కొంది.
ప్రధానంగా ఈ కేసులో ఏ1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి (రాజ్ కసిరెడ్డి)కి వీరితో ఉన్న అనుబంధం, కేసులో ఎక్కడెక్కడ ఎలాంటి పాత్ర పోషించారన్న విషయాలను కూడా వివరించారు. దుబాయ్, హైదరాబాద్, పుంగనూరు నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి ఇంట్లో పలుమార్లు వీరంతా కలిసి చర్చలు జరిపారని సిట్ పేర్కొంది.
ఈ చర్చలకు ఎంపీ మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారని, ఆయన కనుసన్నల్లో డిస్టిలరీలకు టార్గెట్లు విధించారని తెలిపింది. ఈ నేపథ్యంలో మొత్తం నిందితులు సొమ్మును తలా పంచుకుని చివరి లభ్ధిదారుకు చేరవేసిన విధానం, ఆ సొమ్మును ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టిందీ కూడా వివరించారు.
రియల్ ఎస్టేట్ సహా సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టారని, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తాజాగా చార్జిషీట్లో వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates