రెండు రాష్ట్రాల్లో.. రాజ‌కీయ రాఖీలు.. !

రాఖీ పండుగ అంటే.. అన్న‌, త‌మ్ముళ్ల మేలు కోరి.. మ‌హిళ‌లు క‌ట్టే రాఖీ అన్న విష‌యం తెలిసిందే. ఇక‌, త‌మ తోబుట్టువు మేలు కోరి.. అన్న‌ద‌మ్ములు కూడా.. కానుక‌లు ఇస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ద‌క్షిణాదిలో ఈ పండుగ జోరుగా సాగుతోంది. అయితే.. సాధార‌ణ రాఖీ పండుగ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. రాజ‌కీయ రాఖీ పండుగ మాత్రం జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అంటే.. ఇరుగు పొరుగు పార్టీల‌కు చెందిన నాయ‌కులు అధికార పార్టీకి రాఖీ క‌డుతున్నార‌న్న మాట‌.!

ఈ విష‌యంలో తెలంగాణ‌లో జోరు మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇక్క‌డ అధికారంలో ఉన్న పార్టీతో పాటు.. మ‌రో ప్ర‌తిప‌క్షం బీజేపీకి కూడా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ నుంచి వ‌స్తున్న జంపింగులు రాఖీలు క‌డుతున్నారు. మీతోనే మేం ఉంటాం.. మీరు పెట్టిందే తింటాం!.. అంటూ నాయ‌కులు సెల‌విస్తున్నారు. మ‌రోవైపు.. ఉన్న నేత‌లు పోతుండ‌డంతో బీఆర్ ఎస్ పార్టీకి ఏం చేయాలో తెలియ‌డం లేదు. అరిచి గోల చేస్తే.. పార్టీ వీక్ అవుతోంద‌న్న ప్ర‌చారం తామే చేసుకున్న‌ట్టుగా అవుతుంద‌న్న ఆవేద‌న ఉంది.

అలాగ‌ని సైలెంట్‌గా ఉంటే.. నాయ‌కులు లెక్క‌కు మిక్కిలి కారు దిగేస్తున్నారు. ఇదిలావుంటే.. అధికారంలో ఉన్న త‌మ వైపు రాకుండా.. కొంద‌రు నాయ‌కులు ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీవైపు ప‌రుగులు పెడుతుండ‌డాన్ని కాంగ్రెస్ నాయ‌కులు కూడా సీరియ‌స్‌గానే తీసుకున్నారు. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడా నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి జంపింగులు జోరుగా సాగాయి. అయితే.. జంపింగుల రూపంలో కోవ‌ర్టులు క్యూ క‌డుతుండ‌డంతో కూట‌మి అలెర్ట్ అయింది.

ఎవ‌రిని చేర్చుకున్నా.. పార్టీల్లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది. అయితే.. ఆ త‌ర్వాత పూర్తిగా నిలువ‌రించారు. ప్ర‌స్తుతం వైసీపీ నుంచి న‌లుగురు సీనియ‌ర్ నేత‌లు, ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా ఎదురు చూస్తున్నార‌ని.. కూట‌మి గేట్లెక్కేస్తే.. వ‌చ్చి రాఖీలు క‌ట్టేసేందుకు రెడీగా ఉన్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కానీ, ఇప్పుడున్న నాయ‌కులు చాల‌నుకుంటున్న పార్టీలు.. కొత్త‌వారితో రాఖీలు క‌ట్టించుకునేందుకు ఛాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి రాజ‌కీయ రాఖీల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింద‌నే చెప్పాలి.