కేసీఆర్, కేటీఆర్, సంతోష్ ఫోన్లు మాత్రమే ట్యాప్ కాలేదు

తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త నిజం బయటకు వస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు వినిపించగా.. ఆ తర్వాత ఈ వ్యవహారం మరింత విస్తృతంగా జరిగినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లోని నేతలపైనా నిఘా పెట్టేందుకు కూడా పార్టీ అధిష్ఠానం ఫోన్ ట్యాపింగ్ నే వినియోగించిందని శుక్రవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ కు గురైన బీఆర్ఎస్ బాధితుల్లో కేసీఆర్ కుమార్తె కవిత సహా ఆమె భర్త అనిల్, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావూ ఉన్నారట. కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావుల ఫోన్లు మాత్రమే ట్యాప్ కాలేదని, ఇక అందరి ఫోన్లూ ట్యాప్ అయ్యాయంటూ ఆయన ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షిగా శుక్రవారం సిట్ ముందు విచారణకు హాజరైన బండి సంజయ్… విచారణలో భాగంగా సిట్ అధికారులకు కీలక ఆధారాలు అందజేశారు. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తు సిట్ నేతృత్వంలో సరిగా సాగడం లేదని, సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. పనిలో పనిగా ఫోన్ ట్యాపింగ్ కు ఎవరెవరు గురయ్యారన్న వివరాలను కూడా ఆయన వెల్లడించి కలకలం రేపారు. కేసీఆర్ తన కన్నబిడ్డ కవిత ఫోన్ నే ట్యాప్ చేయించారని ఆరోపించిన బండి… కవిత భర్త అనిల్ ఫోన్ నూ వదలలేదని తెలిపారు. ఇక పార్టీతో పాటు కేసీఆర్ కు ఆది నుంచి వెన్నెముకగా నిలుస్తూ వస్తున్న ఆయన మేనల్లుడు తన్నీరు హరీశ్ రావు ఫోన్ నూ ట్యాప్ చేయించారంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ లెక్కన విపక్షాలకు చెందిన బడా, చోటా నేతలతో పాటుగా సొంత పార్టీకి చెందిన కీలక నేతల నుంచి కింది స్థాయి నేతల దాకా బీఆర్ఎస్ అధిష్ఠానం నిఘా పెట్టిందని బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఇక అందరికంటే కూడా తన ఫోన్ నే అత్యదిక సార్లు ట్యాప్ చేశారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ ఉచ్చులో చిక్కిన ప్రతి నేత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆయన ఆరోపించారు. ఇంతటి దారుణమైన నేరాలతో కూడిన కేసును సిట్ తో కాకుండా సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే… బండి సంజయ్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెలుసుకున్న బీజేపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుపై సరైన దర్యాప్తు జరిగేలా చూడాలని సంబంధిత అదికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.