ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న అమరావతి రాజధాని వ్యవహారంలో ఇటీవల కొన్నాళ్లుగా సమస్యలు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అదే.. రాజధానికి అదనపు భూ సమీకరణ. ప్రస్తుతం అమరావతిలో ప్రభుత్వానికి 33 వేల ఎకరాల ల్యాండు బ్యాంకు ఉంది. అయితే.. భవిష్యత్తు అవసరాల కోసం అంటూ.. మరో 44 వేల ఎకరాలను సమీకరించేందుకు సర్కారు రెడీ అయింది. ఇదే వివాదానికి దారితీసింది. ఇప్పటికే తీసుకున్న భూములకు సంబంధించి రైతులకు న్యాయం చేయలేదని.. విమర్శలు వచ్చాయి.
దీంతో అదనంగా భూములు ఇచ్చే పరిస్థితి లేదని కొందరు రైతులు భీష్మించారు. ఇది విపక్షానికి అస్త్రాలు అందించినట్టు అయింది. అయితే.. ప్రభుత్వం దీనిని సునిశితంగా తీసుకుంది. గట్టిగా వ్యవహరిస్తే.. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని భావించిన.. ప్రభుత్వం మధ్యే మార్గంగా రైతులతో పలు దఫాలుగా అంతర్గత చర్చలు చేపట్టింది. తాజాగా ఈ చర్చలు ఫలించాయి. మంత్రి నారాయణ వ్యూహం.. సీఎం చంద్రబాబు సహకారంతో రైతులు దాదాపు దిగి వచ్చారు. రాజధానికి అదనపు భూములు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
పూలింగ్ కు ఇవ్వని భూముల్లో రిటర్నబుల్ ప్లాట్ ల కేటాయింపు – ఆయా ప్లాట్ ల మార్పునకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే.. కొంతమందికి 7వ, 9వ యేడాది కౌలు పడలేదని చెప్పగా.. వారికి నెలలోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే.. గతంలో వేసిన హద్దు రాళ్ళు తొలగిపోయాయి. దీంతో రెండు నెలల్లోగా హద్దు రాళ్ళు ఏర్పాటు చేయనున్నారు. ఇక, భూములు కేటాయించిన కేంద్ర సంస్థల ఏర్పాటు త్వరితగతిన చేయాలని కూడా నిర్ణయించారు. డిసెంబర్ నాటికి మెజారిటీ సంస్థల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యేలా సర్కారు చర్యలు తీసుకోనుంది.
అదే సమయంలో వివాదాస్పదమైన ఆర్ -5 జోన్ సమస్య పరిష్కారం కోసం కూడా సర్కారు అడుగులు వేయనుంది. ప్రధానంగా రైతులు కోరుతున్నట్టు గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు ఏర్పాటు చేయనున్నారు. 900 కోట్లతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. కొండవీటి వాగు, పాల వాగు,గ్రావిటీ కెనాల్ పనులు వేగవంతం చేస్తారు. కేటగిరీ 4 ప్లాట్ ల సమస్యను కూడా రైతులు కోరుతున్నట్టుగానే త్వరితగతిన పరిష్కరించను న్నారు. గ్రామ కంఠాల సమస్యను కూడా నెలలోగా అధ్యయనం చేసి పరిష్కరించేందుకు సర్కారు హామీ ఇచ్చింది. మొత్తంగా అమరావతికి ఏర్పడిన చిక్కులు తొలగించుకుని అడుగులు వేస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates