‘మాటకు-మాట’ అన్నట్టుగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై నిగ్గు తేలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై 15 మాసాల కిందట వేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కూడా ప్రజల ముందు ఉంచు తామని చెప్పారు. అంతేకాదు.. దీనిపై అసెంబ్లీలోనే చర్చించి.. భరతం పడతామని .. తాజాగా మీడియాకు వెల్లడించారు. అవినీతి, ఆశ్రిత పక్ష పాతంతో తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితిలోనూ దీనిపై చర్చ చేపట్టి.. నిర్ణయం తీసుకుంటామని.. ఎవరినీ వదిలేది లేదని తేల్చి చెప్పారు.
అయితే.. ఇదేసమయంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అదినేత, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కూడా స్పందించారు. అయితే.. పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజక్టు పై వేసిన కమిషన్ను ఆయన తప్పుబట్టారు. “అది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. కాంగ్రెస్ పార్టీ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదన్నవాడు అజ్ఞాని” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల బహుళ ప్రయోజనాలను కాంక్షించి.. ఈ ప్రాజెక్టుకు రూపం తీసుకు వచ్చామని చెప్పారు. దీనిలో అవినీతి జరిగిందని.. ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలని కేసీఆర్ తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అదేసమయంలో ఈ కమిషన్ నివేదకను అడ్డు పెట్టుకుని పార్టీ నాయకులు, మాజీ మంత్రులను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. అయితే.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల మధ్యకు వెళ్దామని తేల్చి చెప్పారు. ప్రజల కోసం పనిచేసినప్పుడు.. ఇలాంటి కామనేనని.. ఏదైనా ఉంటే ప్రజలే తేలుస్తారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. కార్యకర్తలు.. నిరంతరం ప్రజల మధ్య ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. “ఈ కమిషన్లు .. రాజకీయాలు మనకు కొత్తనా? ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రయోజనాలను ప్రజలకు వివరించండి. నివేదికపై కేబినెట్లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
రంగంలోకి హరీష్రావు..
ఇదిలావుంటే.. కాళేశ్వరం వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్రావు రంగంలోకి దిగుతున్నారు. మంగళవారం బీఆర్ఎస్ భవన్ వేదికగా.. ఆయన భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు, నిర్ణయం సహా.. తాజాగా కమిషన్ ఇచ్చిన నివేదికపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. తమ తప్పులు లేవని.. దీనిలో రాజకీయ దురుద్దే శమే ఉందని ఆయన చెప్పనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్, ఎంఐఎం సహా.. ఇతర పక్షాల నాయకులను కూడా ఆహ్వానించారు. మీడియాను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాల్లోనూ లైవ్లో(సొంత మీడియా ద్వారా) ప్రసారం చేయాలని నిర్ణయించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates