తెలుగు దేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గానీ, ప్రస్తుత అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గానీ బీసీలకు అన్నింటా అగ్ర తాంబూలమే వేశారు. చంద్రబాబు ఆ సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే, నామినేటెడ్ సీట్లలో అనుకున్న దాని కంటే కూడా మెరుగైన రీతిలోనే సీట్లను ఇచ్చిన బాబు… ప్రభుత్వ పథకాల్లోనూ వారి కోటాకు ఎక్కడ కూడా చిల్లు పడనివ్వడం లేదు. అందులో భాగంగా తాజాగా ఏపీలో కొత్తగా ఏర్పాటు కానున్న బార్లలో బీసీల్లోని కల్లుగీత కార్మికులకు 10 శాతం బార్లను కేటాయించారు.
త్వరలోనే ఏపీలో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఈ పాలసీ ప్రకారం ఏపీలో మొత్తంగా 840 బార్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. వీటిలో 10 శాతం అంటే… 84 బార్లను కల్లు గీత కార్మికులకు కేటాయిస్తారన్న మాట. ఈ బార్లను సదరు సామాజిక వర్గానికి చెందిన వారు అందిపుచ్చుకుని ఆర్థికంగా పుంజుకోనేందుకు బాబు సర్కారు అవకాశం కల్పిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వైన్ షాపుల్లోనూ ఇప్పటికే కల్లు గీత కార్మికులకు బాబు సర్కారు 10 శాతం వైన్ షాపులను కేటాయించిన సంగతి తెలిసింది. తాజాగా బార్లలోనూ వారికి 10 శాతం బార్లను కేటాయించి చంద్రబాబు తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.
ఈ మేరకు ఏపీలోని కూటమి సర్కారు కల్లుగీత కార్మికులకు 10 శాతం బార్లను కేటాయిస్తూ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 10 శాతం బార్లను కూడా ఎక్కడెక్కడ అన్న కేటాయించాలన్న దానిపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేయనుంది. కల్లుగీత కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాల్లోని బార్లను వారికి కేటాయించే అవకాశాలున్నట్లు సమచారం. వరుసబెట్టి బీసీలకు చంద్రబాబు సర్కారు నుంచి అందుతున్న ఇలాంటి పథకాలు వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దనున్నాయన్న వాదనలు బలంగా వినిపిిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates