వైసీపీ అధినేత జగన్పై ఏపీ అధికార పార్టీ టీడీపీ, అదేవిధంగా కాంగ్రెస్ కీలక నాయకులు ఒకే రోజు విరుచుకుపడ్డారు. విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్, టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకకాలంలో జగన్పై నిప్పులు చెరిగారు. ఇద్దరు వేర్వేరుగా స్పందించినా.. ఒకే అంశంపై జగన్పై దుయ్యబట్టారు. మద్యం కుంభకోణాన్ని సెంట్రిక్గా చేసుకుని విమర్శలు గుప్పించారు.
మాణిక్కం ఏమన్నారంటే..
2019-24 మధ్య ఏపీలో దారుణమైన పాలన సాగిందని మాణిక్కం అన్నారు. జగన్ ఓ అవినీతి శాస్త్రవేత్త అని వ్యాఖ్యానించారు. అవినీతి ఎలా చేయాలో.. సొమ్మును ఎక్కడ దాచాలో.. ఎలా దారి మళ్లించాలో.. జగన్కు తెలిసినంతగా ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. అవినీతి ముఠాను మంత్రులుగా చేసుకుని రాష్ట్రాన్ని, ప్రజలను కూడా దోచుకున్నారని ఆరోపించారు. మద్యం కేసులో 11 కోట్ల రూపాయలు లభించాయని.. ఇవి జగన్కు అందాల్సిన సొమ్ముగానే తాము భావిస్తున్నామన్నారు.
ఈ మద్యం కేసులో 3500 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఈ సొమ్ము ఎక్కడెక్కడికి మళ్లించారో తేల్చాల్సిన బాధ్యత ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పైనే ఉందన్నారు. ఈ సొమ్ముతోనే సినిమాలు తీశారని.. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని.. పెట్టుబడులు పెట్టారని ఆయన ఆరోపించారు. జగన్ అవినీతి శాస్త్రవేత్త కాబట్టే.. ఆయన అవినీతిలో ఆరితేరిపోయారని మాణిక్కం చెప్పారు.
ఇక, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరో అడుగు ముందుకు వేశారు. మద్యం కుంభకోణం కేసులో అసలు దోషి జగనేనని చెప్పారు. పట్టుకుని నాలుగు తగిలిస్తే.. అన్ని నిజాలు బయటకు వస్తాయి అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొంగలను పరామర్శిస్తున్న జగన్.. తన అవినీతి పాపానికి బలై జైలు పాలైన వారి కుటుంబాలను ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. జగన్ వారి ఇళ్లకు వెళ్తే.. మహిళలు చీపర్లు, చాటలు తిరగేస్తారని ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates