ఏపీలో అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడుల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ ఇప్పుడే గాడిన పడుతోం దని.. ఇంతలోనే అడ్డుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని.. పిటిషనర్ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో ప్రశ్నించింది. “మీకు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? రాష్ట్రంలో పెట్టుబడులు వస్తుంటే తట్టుకోలేక పోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది సరికాదు. ఏపీ ప్రభుత్వానికి స్వేచ్ఛనివ్వండి. కొన్నాళ్లు వేచి చూడండి. ఆ తర్వాత.. ఏం జరుగుతుందో చూద్దాం. అంతేకానీ.. ఇప్పటికిప్పుడు అడ్డు పడిపోయి..ఏదో జరిగిపోతుందని ఊహల్లో తేలి కోర్టు సమయాన్ని వృథా చేయడం సరికాదు.“ అని పిటిషన్ను సున్నితంగా హెచ్చరించింది.
ఏం జరిగింది?
ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఏపీకి ఆహ్వానించి.. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్ సంస్థకు.. విశాఖలోని మధురవాడలో 21 ఎకరాలకు పైగా భూములను కేటాయించింది. వీటిని ఎకరాకు రూ.0.99 పైసలు చొప్పున కేటాయించింది. టీసీఎస్ కంపెనీ ఈ భూములను వినియోగించుకుని వచ్చే రెండేళ్లలో పెట్టుబడులు పెడితే.. 5000 మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు.. మరో 10వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతర్జాతీయస్థాయికి విశాఖ పేరు చేరుతుంది.
అయితే.. ఇలా ఎకరా భూమిని రూ.0.99 పైసలకు కేటాయించడాన్ని తప్పుబడుతూ.. వైసీపీకి చెందిన ఓ నాయకుడుగా భావిస్తున్న ఓ వ్యక్తి.. హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని బుధవారం విచారించిన హైకోర్టు.. ఒక పరిశ్రమ, ఒక పెట్టుబడి వచ్చేందుకు ఇప్పుడు దేశంలో ఎంతో పోటీ ఉందని.. అనేక రాష్ట్రాలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకు వేసి ఏపీ ప్రభుత్వం భూములు కేటాయించిందని భావించడంలో తప్పులేదు కదా! అని వ్యాఖ్యానించింది. “భూములను ఎంత తక్కువకు కేటాయించారన్నది పక్కన పెడితే.. సదరు కంపెనీ రావడం వల్ల.. ఏపీకి ఒనగూరే ప్రయోజనాలు ఎంత? అనేది ముఖ్యం.“ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ సందర్భంగా ప్రబుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భూములను ఉచితంగా ఇచ్చేస్తున్నారన్న పిటిషన్ వాదన సరికాదన్నారు. మహారాష్ట్రంలో రూ..25 పైసలకే ఎకరాభూమిని కేటాయించిన సందర్భాలు ఉన్నాయన్నారు. పెట్టుబడులు వస్తే..యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. పైగా.. భూములను లీజు పద్ధతిలోనేకేటాయిస్తున్నాని వివరించారు. పిటిషనర్ దురుద్దేశ పూర్వకంగానే పిటిషన్ వేశారని.. రాష్ట్రంలో ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. కంపెనీ వార్షిక టర్నోవర్ సహా.. ఆ కంపెనీ చేసే వ్యాపారాలను అనుసరించి.. విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీనిని హైకోర్టు సమర్థించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates