తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. తన సహజ స్వభావానికి విరుద్ధంగా చంద్రబాబునాయుడు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటించేశారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నేతలతో జూమ్ కాన్ఫరెన్సులో మాట్లాడినపుడు పనబాక లక్ష్మీనే అభ్యర్ధిగా ప్రకటించేశారు. చంద్రబాబు చేసిన అభ్యర్ధి ప్రకటనతో టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అభ్యర్ధిని చంద్రబాబు ప్రకటిస్తారని నేతలెవరు ఊహించలేదు కాబట్టే.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా నామినేషన్ల వేయటానికి చివరి రోజు వచ్చేంతవరకు అభ్యర్ధిని ప్రకటించే అలవాటు లేదు చంద్రబాబుకు. అలాంటిది మిగిలిన పార్టీలకన్నా ముందే అభ్యర్ధిని ప్రకటించేయటంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి పెరిగిపోయింది. ఇప్పటివరకు తిరుపతిలో బీజేపీ నేతల హడావుడి మాత్రమే జరుగుతోంది. అభ్యర్ధిని ప్రకటించకపోయినా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవదర్ అండ్ కో మాత్రం రెగ్యులర్ గా తిరుపతిలో పర్యటిస్తు హీట్ పంచేస్తున్నారు. అలాంటిది చంద్రబాబు టీడీపీ అభ్యర్ధిని ప్రకటించేయటంతో ఇటు బీజేపీ అటు టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయినట్లయ్యింది.
ఇక మిగిలింది అధికార వైసీపీ మాత్రమే. నిజానికి వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గా ప్రసాదరావు మరణంతోనే ఇప్పుడు ఉపఎన్నికలు అవసరమయ్యాయి. మరి వైసీపీ తరపున బల్లి కుటుంబసభ్యులనే పోటీ చేయిస్తారా ? లేకపోతే బయట నేతలను ఎంపిక చేస్తారా ? అనే విషయం సస్పెన్సుగా మిగిలిపోయింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధి విషయంలో జగన్మోహన్ రెడ్డికి పూర్తి సమాచారం ఉండటంతో నేతలు పెద్దగా ప్రయత్నాలు చేసుకోవటం లేదు.
సరే అభ్యర్ధి ఎవరనేది తేలకపోయినా బీజేపీ తరపున ప్రచారం మాత్రం మొదలైపోయింది. బీజేపీనే పోటీ చేస్తుందని ఇప్పటికే వీర్రాజు ప్రకటించేశారు కాబట్టి జనసేన తరపున అభ్యర్ధి ఉండరనే అందరు అనుకుంటున్నారు. మరి బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్ధి ఎవరంటే మాత్రం ఎవరు చెప్పలేకున్నారు. అందుకనే అభ్యర్ధిని విడిచిపెట్టేసి పార్టీ కే ఓట్లేయమని పార్టీ నేతలు తిరుపతిలో ప్రచారం మొదలుపెట్టేశారట. మార్చిలోగా జరిగే ఉపఎన్నికలకు ఇప్పుడే హీట్ పెరిగిపోయింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఇంకెంత హీట్ పెరిగిపోతుందో చూద్దాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates