ఉప రాష్ట్ర‌ప‌తి రాజీనామా.. రీజ‌నేంటి?

భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ త‌న ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేశారు. 74 ఏళ్ల జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ సోమ‌వారం.. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన సంద ర్భంగా రాజ్య‌స‌భ‌కు కూడా వ‌చ్చారు. స‌భ‌లో చ‌లోక్తులు కూడా విసిరారు. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌కు చుర‌క‌లు కూడా అంటించారు. స‌భ‌ను స‌జావుగా న‌డిపించేలా స‌హ‌క‌రించాల‌ని కూడా ప‌దే ప‌దే ఆయ‌న కోరారు. అయితే.. అనూహ్యంగా రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ రాజీనామా చేశారు.

త‌న రాజీనామా ప‌త్రాన్నిరాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు స‌మ‌ర్పించారు. అనారోగ్య కార‌ణాల‌తోనే తాను ప‌ద‌వి నుంచి త‌ప్పుకొంటు న్నాన‌ని జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ త‌న రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుత వ‌య‌సులో త‌నకు ఆరోగ్య‌మే ప్ర‌ధాన‌మ‌ని.. దీనిని మించింది ఏమీ లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో త‌న రాజీనామాను ఆమోదించాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన రాష్ట్ర‌ప‌తి, కేంద్ర ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అదేవిధంగా రాజ్య‌స‌భ‌ను స‌జావుగా న‌డిపించే క్ర‌మంలో స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

సైలెంటే అయినా..

రాజ‌స్థాన్‌లోని ఝున్‌ఝున్ జిల్లాకు చెందిన జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌.. న్యాయ‌వాదిగా వృత్తిని ప్రారంభించారు. వ్య‌వ‌సాయ కుటుంబం నుంచి వ‌చ్చిన ఆయ‌న‌.. తొలినాళ్ల‌లో బీజేపీలో చేరారు. త‌ర్వాత కాలంలో ముఖ్యంగా ప్ర‌ధాని మోడీ .. ఢిల్లీలో పాగా వేసిన త‌ర్వాత‌.. ఆయ‌న శిబిరంలోని నాయ‌కుడిగా చేరిపోయారు. దీంతో బీజేపీయేత‌ర పార్టీలు ప్ర‌భుత్వాలు న‌డుపుతున్న రాష్ట్రాల్లో ఒక‌టైన ప‌శ్చిమ బెంగాల్‌కు గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించారు. అప్ప‌ట్లో ఆయ‌న నియామ‌కం, వ్య‌వ‌హార శైలి.. వంటివి .. తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీశాయి. మ‌మ‌తా బెన‌ర్జీ వ‌ర్సెస్ రాజ్‌భ‌వ‌న్ మ‌ధ్య అనేక సంద‌ర్భాల్లో భోగి మంట‌లు రేగాయి. గ‌వ‌ర్న‌ర్‌గా ఉండి.. నేరుగా ప్రెస్ క్ల‌బ్‌కు వ‌చ్చి మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌డం.. అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నంగా మారింది.

ఇక‌, ఆ త‌ర్వాత‌.. ఏపీకి చెందిన వెంక‌య్య‌నాయుడు ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి నుంచి రిటైరైన త‌ర్వాత‌.. అనూహ్యంగా జ‌గ‌దీప్‌కు 2022, జూలై 16న ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ద‌క్కింది. అంటే.. ఇప్ప‌టికి మూడు సంవ‌త్స‌రాలు మాత్ర‌మే పూర్త‌య్యాయి. మ‌రో రెండేళ్ల పాటు ఆయ‌న‌ప‌ద‌వీ కాలం ఉంది. ఇక‌, రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా కూడా.. ఆయ‌న త‌న‌దైన శైలిని వీడ‌లేదు. ప్ర‌తిప‌క్షాల‌పై నిప్పులు చెర‌గ‌డంలో అధికార ప‌క్షాన్ని మించి వ్య‌వ‌హ‌రించారనే విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్నారు. ఏ విష‌యంపైనైనా నిర్బ‌యంగా వ్యాఖ్య‌లు చేయ‌డం జ‌గ‌దీప్ సొంతం. అది రాజ్యాంగ‌మే అయినా.. సుప్రీంకోర్టు అయినా.. ఆయ‌న మోడీ ప‌క్షాన్నే నిల‌బ‌డ్డార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి.