దేశంలో బిజీయెస్ట్ సీఎం చంద్ర‌బాబే.. !

దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు 28 మంది ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అయితే, దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రిల పనితీరును అదేవిధంగా రోజు మొత్తంలో వారు చేస్తున్న పనులను అంచనా వేసిన ఢిల్లీకి చెందిన సంస్థ‌ దేశవ్యాప్తంగా అత్యంత బిజీగా ఉండేటటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని స్పష్టం చేసింది. ఈ విషయంలో కొన్ని కారణాలను కూడా వెల్లడించింది. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా గత ఏప్రిల్ లో నిర్వహించిన సర్వేలో అనేక విషయాలు వెల్లడైన‌ట్టు పేర్కొంది.

ముఖ్యమంత్రిగా ఉన్న వారిలో రోజు మొత్తంలో ఎన్ని గంటలు పని చేస్తున్నారు? ఏ ఏ అంశాల మీద దృష్టి పెడుతున్నారు? రాష్ట్ర ప్రజలకు ఎంత చేరువ అవుతున్నారు? అలాగే మంత్రులపై ముఖ్యమంత్రులకు ఉన్నటువంటి నియంత్రణ ఎలా ఉంది? దిశా నిర్దేశం ఎలా చేస్తున్నారు? రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు… ఇలా అనేక అంశాలపై ఈ సంస్థ సర్వే చేసింది. ఈ సంస్థ చేసిన సర్వేల్లో ఏపీ విషయానికి వచ్చేసరికి చంద్రబాబుకు మంచి మార్కులు పడ్డాయని తెలుస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి, పెట్టుబడుల‌ విషయంలో దేశవ్యాప్తంగా తెలంగాణ, ఏపీ పోటీ పడుతున్నాయని పేర్కొనడం గమనార్హం.

అదేవిధంగా గుజరాత్ మహారాష్ట్రలు ఉత్తరాదిన పోటీ పడుతుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ ముందు వరుసలో ఉన్నాయని తెలిపింది. ఇక మంత్రులపై నియంత్రణ విషయానికి వచ్చేసరికి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ఏపీ తెలంగాణలలో నియంత్రణ లేదని, వారికి కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారని పేర్కొంది. ప్రధానంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లో మంత్రులకు సానుకూల వాతావరణం ఉందని, పనిచేసుకునేందుకు స్వేచ్ఛ ఉందని పేర్కొనడం విశేషం. అలాగే ప్రజలకు చేరువవుతున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు చాలా ముందున్నారని ఈ సర్వే తెలిపింది.

ఢిల్లీకి చెందిన ఐఐటీ నిపుణుల‌తో కలిసి దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు పని విషయంలో నూటికి నూరు శాతం మార్కులు వేయటం విశేషం. ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ వరుసలో 9వ స్థానంలో ఉండడం విశేషం. ఈ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రజలకు చేరు అవుతున్నారని చెప్పడం, అదేవిధంగా సమస్యలపై స్పందిస్తున్నరని కూడా ఈ సర్వే తెలిపింది.

ఇక రాష్ట్ర అభివృద్ధి విషయానికి వచ్చేసరికి విజన్ 2047తో ఏపీ ముఖ్యమంత్రి తొలి స్థానంలో నిలిచారు అని సర్వే తెలిపింది. ఇతర ముఖ్యమంత్రులు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నా.. ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకు సాగుతున్నటువంటి ముఖ్యమంత్రి లో చంద్రబాబు ముందున్నారనేది ఈ సర్వే తెలిపిన విషయం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకున్నటువంటి రాష్ట్రాల్లో గుజరాత్ అదే విధంగా బీహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర ముందున్నాయి.

అదేవిధంగా ఏపీ కూడా ఇప్పుడు ఈ జాబితాలో చేరే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తంగా చూస్తే చంద్రబాబు బిజియెస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నారని ఈ సర్వే చెప్పటం గమనార్హం. రోజుకు 18 గంటల పాటు ఆయన పని చేస్తున్నారని, సర్వేలు, సమీక్షలు, ప్రజలను కలవడం వంటి వాటితో నిరంతరం ఆయన విధుల్లో ఉంటున్నారని ఈ సర్వే పేర్కొంది. దేశంలో గోవా ముఖ్యమంత్రి కూడా ఇలానే చేస్తున్నారని సర్వే పేర్కొనడం విశేషం.