ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పాత మద్యం విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం, మద్యం ప్రియులకు మరో బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. తాజాగా మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్లకు మళ్లీ అనుమతినిచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
వైకాపా హయాంలో పూర్తిగా రద్దైన పర్మిట్ రూమ్ల విధానాన్ని తిరిగి ప్రారంభించాలనే నిర్ణయానికి ఎక్సైజ్ శాఖ వచ్చింది. ఆదాయం పెంపునే లక్ష్యంగా సెప్టెంబర్ నుంచే అనుమతులు ఇవ్వనున్నారు. దీనితోపాటు మద్యం దుకాణాల్లో త్రాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.
గతంలో ఏడాదికి ప్రతి దుకాణం నుంచి రూ.5 లక్షలు వసూలు చేయగా, ఇప్పుడు రెండు కేటగిరీలుగా విభజించారు. కార్పొరేట్ నగరాల్లో రూ.7.5 లక్షలు, మిగిలిన ప్రాంతాల్లో రూ.5 లక్షల చొప్పున వసూలు చేయాలని ప్రతిపాదించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,736 మద్యం దుకాణాలు ఉన్నాయి. మొత్తం లెక్కించుకుంటే కనీసం రూ.186 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కార్పొరేషన్ దుకాణాల ద్వారా అదనంగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. 99 రూపాయల క్వార్టర్లతో పాటు ఇప్పుడు పర్మిట్ రూమ్లను తెరచేస్తుండటంతో పేద, మధ్య తరగతి మద్యం ప్రియుల్లో హర్షాతిరేకం నెలకొంది.
ఒకవైపు ఆదాయం పెరిగేలా చూస్తూనే, మరోవైపు మద్యం నియంత్రణ పేరుతో సౌకర్యాలు కల్పించడంపై చర్చ మొదలైంది. ఈ విధానంతో రాష్ట్రానికి సంవత్సరానికి రూ.200 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates