తెలంగాణ పాలిటిక్స్‌లో రామ‌చంద‌ర్ కు అన్నీ టెస్టులే!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా అవ‌కాశం ద‌క్కించుకున్న నార‌ప‌రాజు రామ‌చంద్ర‌ర్‌రావు.. ఏమేర‌కు పార్టీని బ‌లోపేతం చేయనున్నారు? ప్ర‌తిప‌క్షం, అధికారప‌క్షాన్ని ఎంతవ‌ర‌కు నిలువ‌రించ‌నున్నారు? పార్టీని ఏ ర‌కంగా ముందుకు తీసుకువెళ్తారు? అనేది ఆస‌క్తిక‌ర విష‌యం. తాంబూలాలిచ్చేశామంటూ.. బీజేపీ అగ్ర‌నాయ‌కులు రామ‌చందర్‌రావుకు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించేశారు. లాంఛ‌న ప్రాయంగానే ఎన్నిక నిర్వ‌హించ‌డం..ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నార‌ని ప్ర‌క‌టించ‌డం.. జ‌రిగిపోయాయి. ఇక‌, బీజేపీని న‌డిపించే బాధ్య‌త రామ‌చంద‌ర్‌రావుపైనే ప‌డింది.

అనేక స‌మ‌స్య‌లు..

అయితే.. రామ‌చంద‌ర్‌రావుకు బీజేపీ ప‌గ్గాలు అంద‌డం తేలికే అయినా.. ప‌ద‌విని ద‌క్కించుకోవ‌డం సుల‌భ‌మే అయినా.. పార్టీని ముందుకు న‌డిపించ‌డంలో ఆయ‌న‌కు అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా జిల్లాల వారీగా సీనియ‌ర్ నాయ‌కులు విడిపోయి గ్రూపు రాజ‌కీయాలు చేస్తున్న విష‌యం తెలిసింది. పొరుగు పార్టీల నుంచి వ‌చ్చిన వారు… సైద్ధాంతికంగా బీజేపీతో ముడివేసుకున్న‌వారు.. అనే రెండు విభాగాలుగా నాయ‌కులు విడిపోయారు. వీరు ఎవ‌రి మాటా విన‌ని సీత‌య్య‌ల మాదిరిగా రాజ‌కీయాలు సెగ పుట్టిస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ నుంచి ధ‌ర్మ‌పురి అర్వింద్ వ‌ర‌కు.. వారికి వారే రాష్ట్ర స్థాయిలో అధిష్టానం. వారికి వారే రాష్ట్ర స్థాయిలో సుప్రీం.

దీంతో ఇలాంటి వారిని ఐక్యంగా ముందుకు న‌డిపించ‌డం అంటే.. రామ‌చంద‌ర్‌రావుకు నిప్పుల‌పై న‌డ‌కేన‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. దూకుడు నాయ‌కుడిగా ఆయ‌న పేరు లేదు. సౌమ్యుడిగా.. ఆలోచ‌నా ప‌రుడిగా.. అంత‌కు మించి ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలాన్ని పుణికి పుచ్చుకున్న నాయ‌కుడిగా మాత్ర‌మే రామ‌చంద‌ర్‌రావుపేరు తెచ్చుకున్నారు. కానీ.. తెలంగాణ రాజ‌కీయాలు అలా అయితే లేవు.. త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. తలుపు చెక్క‌తో నేనొక‌టంటా అన్న‌ట్టుగా నాయ‌కులు రెచ్చిపోతున్నారు. సో.. ఇలాంటివారిని డీల్ చేయాలంటే.. చాలా క‌ష్ట‌మ‌న్న‌ది సొంత పార్టీ నాయ‌కుల్లోనే చర్చ ఉంది.

ఇక‌, రానున్న కాలంలో ముందుగా స‌వాల్‌గా మారేది.. జీహెచ్ఎంసీ ఎన్నిక‌లే. రామ‌చంద‌ర్‌రావుకు హైద‌రాబాద్‌పైనా.. ఇక్క‌డి రాజ‌కీయాల‌పైనే మంచి ప‌ట్టుంది. అయితే.. ఎంఐఎం, బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల వ్యూహాత్మ‌క రాజ‌కీయాల‌ను ఆయ‌న ఎలా ఎదుర్కొంటారు..? ముఖ్యంగా క‌లివిడి లేని నాయ‌కుల తీరును ఆయ‌న ఎలా లైన్‌లో పెడ‌తార‌న్న‌ది ముఖ్యం. గ‌తంలో బండి సంజ‌య్ పాద‌యాత్ర, నోటి దురుసు కార‌ణంగా.. పార్టీ క్షేత్ర‌స్తాయిలో కొంత మేర‌కు బ‌లప‌డింద‌నేది వాస్త‌వం. కానీ.. కిష‌న్ రెడ్డి హ‌యాంలో గ్రూపు రాజ‌కీయాలు పెరిగాయి. ఈ ప‌రిణామాల‌తోనే పార్టీ ఇబ్బందులు పడుతోంది. ఈ నేప‌థ్యంలో సౌమ్యుడిగా పేరున్న రామ‌చంద‌ర్ రావు.. వీటిని ఎలా ఎదుర్కొంటార‌న్న‌ది చూడాలి.