తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ నాయకుడినే ముఖ్యమంత్రిని చేస్తారని.. కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర చీఫ్ నియామకం వ్యవహారం కాక రేపుతున్న సమయంలో బండి చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిగా మారాయి. నిజానికి రాష్ట్రంలో ఎన్నికలు జరిగేందుకు మూడేళ్ల సమయం ఉంది. పైగా.. బీజేపీ క్షేత్రస్థాయిలో ఎంత వరకు పుంజుకుందనేది తేలాల్సి కూడా ఉంది. అయినా.. బండి సంజయ్ మాత్రం ఫ్యూచర్ ప్లాన్ చెప్పుకొచ్చారు.
ప్రజలంతా తమతోనే ఉన్నారని చెబుతున్న బండి.. వచ్చే ఎన్నికల్ల బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు. అప్పుడు బీసీ నాయకుడికి పార్టీ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల బీజేపీ చేసిన సీఎం అభ్యర్థుల నియామకాలను ఆయన ఉదహరించారు. రాష్ట్రంలో కూడా 40 శాతానికిపైగా ఉన్న బీసీలకు బీజేపీ న్యాయం చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠం బీసీలకే అప్పగిస్తుందని చెప్పుకొచ్చారు. బీఆర్ ఎస్ పార్టీ రాష్ట్రాన్ని, ప్రజలను కూడా మోసం చేసిందన్నారు. ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నారు.
కానీ, తమ పార్టీ అలా కాదన్న సంజయ్.. బీసీలకు పెద్దపీట వేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీసీకే రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందన్న ఆయన.. ఈ విషయంలో కొందరు(రాజాసింగ్) చేస్తున్న యాగీని ఎవరూ సమర్థించరని చెప్పారు. పార్టీకి హైకమాండ్ ఉందని.. పెద్దలు చెప్పినట్టే అందరూ నడుచుకోవాలని అన్నారు.
నేను కావాలంటే.. నేను కావాలని అధ్యక్ష పదవి కోసం పోటీ పడడం తప్పుకాదు. కానీ, అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నాక.. దానిని గౌరవించాల్సిన అవసరం ఉంది. రేపు బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని అధిష్టానం చెబుతుంది. ఇది ఖాయం. దీనిని అందరూ గౌరవించాలి అని సంజయ్ వ్యాఖ్యానించారు. అయితే.. సంజయ్ ఊహించి చెప్పారో.. లేక అధిష్టానం కూడా ఆదిశగానే ఆలోచన చేస్తోందో అనేది మూడేళ్ల తర్వాత కానీ తేలదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates