వైఫ‌ల్యం నుంచి వైఫ‌ల్యం దిశ‌గా..

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీగా 11 స్థానాల‌కు ప‌రిమితైన వైసీపీలో మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు నాయకులను అటు ఇటు మార్చి నియోజకవర్గంలో ప్రయోగాలు చేసిన వైసిపి అధినేత జగన్.. ఆ తర్వాత కూడా దానిని కొనసాగిస్తున్నారు. వాస్తవానికి నియోజకవర్గం మార్పు అనేది వికటించిన ప్రయోగం. చాలామంది నాయకులు ఓడిపోవడానికి ఈ మార్పు కారణం అన్న చర్చ కూడా పార్టీలో ఉంది.

అయితే దీనిపై ఏమాత్రం విశ్లేషణ చేయకుండా సమస్యలు పట్టించుకోకుండా స్థానిక ప్రజలు, స్థానిక నాయకులు, స్థానిక కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా వైసిపి అధినేత వేస్తున్న అడుగులు ఆ పార్టీకి శాపంగా మారుతున్నాయని సొంత పార్టీ నాయ‌కులే అంటున్నారు. తాజాగా మ‌రిన్ని మార్పుల దిశ‌గా అడుగులు వేశారు. ఎక్క‌డో ఉన్న వారిని తీసుకువ‌చ్చి మ‌రెక్క‌డో నియ‌మించారు. త‌ద్వారా నియోజ‌క‌వ‌ర్గాల్లో అస‌మ్మ‌తిని.. అసంతృప్తిని జ‌గ‌నే స్వ‌యంగా రాజేస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

గత ఎన్నికలకు ముందు కూడా ఇలానే సొంత నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గంలో మార్పులు చేసి కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నామన్న పేరుతో కార్యకర్తలకు నాయకులకు చెప్పకుండా తీసుకున్న‌ నిర్ణయాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఫలితంగా గెలుస్తాం అనుకున్న చోటు కూడా ఘోరమైన ప‌రాభవాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చింది. కేవలం 11 స్థానాలకు పార్టీ పరిమితమైంది. ఆ తర్వాత అయినా సమీక్షించుకొని ఎక్కడవారిని అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తారని అందరూ అనుకున్నారు.

కానీ జగన్‌లో అటువంటి మార్పు ఇంతవరకు కనిపించలేదు. పైగా ఇప్పుడు అదే పద్ధతిని కొనసాగిస్తున్నా రు. తాజాగా స‌త్తెన‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న అంబ‌టి రాంబాబును గుంటూరు వెస్టులో నియ‌మించారు. దీనిని స్థానిక నాయ‌కులు వ్య‌తిరేకిస్తున్నారు. అయినా.. జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేదు. రాయ‌చోటిలో ప్ర‌శాంతంగా ఉన్న‌రాజ‌కీయాల్లో టీడీపీ నుంచివ‌చ్చిన సుగ‌వాసి సుబ్ర‌మ‌ణ్యాన్ని చేర్చుకున్నారు. ఇది మ‌రో ఆధిప‌త్య కేంద్రానికి అవ‌కాశం ఇచ్చిన‌ట్టేన‌ని చెబుతున్నారు. సో.. ఇలాంటి నిర్ణ‌యాల‌తో పార్టీ పుంజుకోవ‌డం మాటేమో.. కానీ, వైఫ‌ల్యం నుంచి వైఫ‌ల్యం వైపు.. అన్న‌ట్టుగా వైసీపీ ప‌రుగులు పెడుతోంద‌ని ప‌రిశీల‌కులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.