2027లోనే జమిలి ఎన్నికలు: పెద్దిరెడ్డి

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఇప్పటికి 13 నెలలు దాటిపోతోంది. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఏర్పడిపోయాయి. ఎవరికి తగ్గట్టుగా వారు పాలన సాగిస్తున్నారు. తిరిగి ఎన్నికలు రావాలంటే…రాజ్యాంగం ప్రకారం ఐధేళ్లు.. అంటే ఇంకో 3 ఏళ్ల 11 నెలల సమయం అయితే ఆగాల్సిందే కదా. మరి ఎందుకో గానీ… ఏపీలో 2019 నుంచి ఐధేళ్ల పాలు పాలన సాగించిన వైసీపీ… 2029 వరకు ఆగలేకపోతోంది. అంతకంటే ముందే ఎన్నికలు జరిగి తిరిగి తాను అధికారంలోకి రావాలని కోరుతోంది. ఇప్పటికే చాలామంది నేతలు జమిలి ఎన్నికలను ప్రస్తావిస్తూ 2027లోనే జరుగుతాయని ఇదివరకే చెప్పారు. ఇప్పుడు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అదే మాట వల్లె వేశారు.

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటమి పాలైన పార్టీలన్నీ కూడా తదుపరి ఎన్నికలు త్వరగా వస్తే బాగుండని కోరుకున్నాయి. ఈ క్రమంలో అప్పటికే కేంద్రం జమిలి ఎన్నికలపై ఓ మోస్తరు కసరత్తు చేసిన నేపథ్యంలో ఆ పార్టీలన్నీ కూడా తదుపరి ఎన్నికలు 2027లోనేనని దాదాపుగా ఓ అంచనాకు వచ్చాయి. అయితే ఆ తర్వాత జమిలిపై జరిగిన పురోగతి, కేంద్రం చేపట్టిన కసరత్తు, ఆ కసరత్తు కారణంగా జమిలి నిర్దేశిత సమయం కంటే ముందే జరగడం దుర్లభమే నని తేల్చి చెప్పింది. అంతేకాకుండా నియోజకవర్గాల పునర్విభజన కూడా పెండింగ్ లో ఉన్ననేపథ్యంలో ఈ రెంటినీ ఒకే దఫా చేపట్టడం కూడా అంత ఈజీ కాదు. దీంతో వైసీపీలోని మెజారిటీ నేతలు కూడా జమిలిపై ఆశలు వదులుకున్నారు.

అయితే పెద్దిరెడ్డిలో మాత్రం జమిలిపై ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయని చెప్పక తప్పదు. ఆదివారం నంద్యాల జిల్లాలో పర్యటించిన సందర్బంగా జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డితో కలిసి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలు 2027 ఫిబ్రవరిలోనే జరగనున్నాయని పెద్దిరెడ్డి చెప్పారు. ఈ మేరకు కేంద్రం చురుగ్గా కసరత్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలను తనకు ఓ కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారంటూ ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీని కూటమి 11 సీట్లకు పరిమితం చేస్తే.. 2027 జమిలి ఎన్నికల్లో టీడీపీని సింగిల్ డిజిట్ కు పరిమితం చేద్దామని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.