జ‌గ‌న్ పై ఇంకా సింప‌తీ రాలేదు

వైసిపి అధినేత జ‌గ‌న్‌ చేపట్టిన రెండు కార్యక్రమాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇవి రెండూ ఈ నెలలోనే జరగడం, రెండు ఘ‌ట‌నల్లోనూ పోలీసులు స్పందించిన తీరు వంటివి చర్చకు దారి తీశాయి. ఈ నేపద్యంలో సింపతి వస్తోందని, ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నారని వైసీపీ చెబుతుంటే, ప్రభుత్వం మాత్రం ఇది సింపతి కాదు, ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారంగా భావిస్తోంది. ఈ క్రమంలో ఈ రెండు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్న కూటమి ప్రభుత్వం నిజంగానే సంపతి వచ్చిందా లేక వైసిపి దూకుడుగా వ్యవహరిస్తుందా తేల్చింది.

ఇవన్నీ కాకుండా ప్రభుత్వంపై వ్యతిరేకత నిజంగానే పెరుగుతోందా.. అని ఈ మూడు కోణాల్లోనూ పరిశీలన చేస్తోంది. ఐవిఆర్ఎస్ ఫోన్ కాల్ సర్వే ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై మీరు ఇచ్చే మార్కులు ఎన్ని. ప్రతిపక్షం చేస్తున్న ప్రదర్శనలతో మీరు ఇబ్బందులు పడుతున్నారా. ప్రతిపక్షం నాయకులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా వంటి ఐదు ఆరు ప్రశ్నలను సంధిస్తున్నారు.

ఇబ్బంది పడుతున్నామని చాలామంది చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు బహిరంగ ప్రదర్శన ద్వారా తాము నరకం చవిచూస్తున్నామని పట్టణాలు నగరాల్లో ప్రజలు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ప్రకాశం జిల్లా పొదిలి, గుంటూరు జిల్లా రెంటపాళ్లలో నిర్వహించిన రెండు కార్యక్రమాలు సుదీర్ఘంగా సాగాయి. పొదిలి పర్యటన సందర్భంగా మూడు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయితే.. రెంటపాళ్ల పర్యటన అయితే ఎనిమిది గంటల నుంచి 9 గంటల వరకు కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

దీనిపై కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరును మధ్యతరగతి ప్రజలు తప్పుపడుతున్నారు. ఇలాంటి ప్రదర్శనలు ఉంటే ముందుగానే చెబితే తమ ప్రయాణాలు వాయిదా వేసుకుంటామని లేదా రద్దు చేసుకుంటామని ఇలా అకస్మాత్తుగా నిర్వహించడం వల్ల తమ ఇబ్బందులు పడుతున్నామని వారు ఫోన్ కాల్స్ సర్వేల్లో చెబుతుండడం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తూ ఉండడం గమనార్హం. ప్రధానంగా వైసీపీ చెబుతున్నట్టుగా ప్రజల్లో ఇప్పటికి ఇప్పుడు ఆ పార్టీ పై సింప‌తీ రాలేదు.

నిజానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అన్న కారణంగా అసెంబ్లీకి వెళ్లకపోవడం, కీలక నాయకులు పార్టీని విడిచి వెళ్లిపోయిన నేపథ్యంలో వైసిపికి సాధారణంగానే సింపతి ఉండాలి. కానీ ఆ పరిస్థితి ఇంకా కనిపించలేదు. దీంతో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి చేపట్టిన సర్వేలలో కూడా ఇదే అభిప్రాయం వెల్లడైంది. దీంతో వైసిపికి దక్కింది సింపతీ కాదని ప్రచార ఆర్భాటం మాత్రమేనని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిని బట్టి భవిష్యత్తు నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.