ఏపీలో పెను కలకలం రేపుతున్న మద్యం కుంభకోణంలో ఏ39గా ఉన్న చెవిరెడ్డి భాస్కర రెడ్డి కుమారుడు, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోసం పోలీసులు వేట మొదలు పెడతారా? లేదంటే మూడు రోజుల పాటు వేచి చూస్తారా? అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయగా… మోహిత్ మాత్రం విచారణకు డుమ్మా కొట్టారు.
సిట్ నోటీసులు అందడానికి ముందే మోహిత్ రెడ్డి ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కారణమేమిటో తెలియదు గానీ ఈ పిటిషన్ బుధవారం మధ్యాహ్నం కూడా విచారణకు రాలేదు. ఎప్పుడు విచారణకు వస్తుందో కూడా చెప్పడం కష్టంగానే ఉంది. ఈ క్రమంలో విచారణకు హాజరయ్యేందుకు తనకు మూడు రోజుల సమయం కావాలంటూ మోహిత్ రెడ్డి సిట్ కు ఓ లేఖ రాశారు. ఈ లేఖపై బుధవారం మధ్యాహ్నం దాకా సిట్ స్పందించ లేదు. ఒకవేళ సిట్ ఈ ప్రతిపాదనకు ఓకే అంటే సరేసరి… లేదంటే మోహిత్ కోసం సిట్ వేట మొదలు పెట్టడం ఖాయమే నని చెప్పాలి.
లిక్కర్ స్కాంలో తమను ఇరికిస్తున్నారహో అంటూ మోహిత్ రెడ్డి తండ్రి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పలుమార్లు ఆరోపించి… తీరా సిట్ ఎంట్రీ ఇచ్చే సమయానికి దేశం దాటి వెళ్లేందుకు యత్నించి పట్టుబడిపోయారు. అంతేకాకుండా చెవిరెడ్డి ద్వయానికి లిక్కర్ కేసులో సహకరించినట్లుగా భావిస్తున్న నలుగురు వ్యక్తుల్లో ఓ వ్యక్తి భాస్కర రెడ్డితో పాటే అరెస్టు కాగా… మిగిలిన ముగ్గురి జాడ ఇప్పటిదాకా తెలియరాలేదు. వారు ఎంచక్కా దేశం దాటి వెళ్లిపోయి ఉంటారన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మోహిత్ రెడ్డి ప్రతిపాదనకు సిట్ సానుకూలంగా స్పందిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates