దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి భారీ షాక్ తగిలింది. అంతేకాదు, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోనూ బీజేపీ ఓడిపోయింది. కేవలం ఒక్కే ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ విజయాన్ని సాధించింది. ఇదే సమయంలో మోదీతో నిత్యం వివాదాలు సాగించే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అటు గుజరాత్లోను, ఇటు తమ పాలన సాగుతున్న పంజాబ్లోను ప్రజలు ఆప్ అభ్యర్థులను గెలిపించారు.
ఇక పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి తాజాగా జరిగిన ఉప ఎన్నిక షాక్ ఇచ్చింది. కనీసం 15 వేల ఓట్లు కూడా పడలేదు. దీంతో సదరు అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. ఇక్కడ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రభపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అందరూ కూడా మోదీ ఫొటోతో, మోదీ పథకాలు, విశ్వగురు అనే కాన్సెప్టుతోనూ ప్రచారానికి దిగడం, వారంతా ఓడిపోవడం గమనార్హం.
ఎక్కడెక్కడ ఎలా ఎలా?
— నాలుగు రాష్ట్రాల్లో 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిని బీజేపీ సీరియస్గా తీసుకుంది. వీటిలో గుజరాత్లోనే రెండు స్థానాలు ఉన్నాయి. కేరళలో ఒకటి, పశ్చిమ బెంగాల్లో ఒకటి, పంజాబ్లో ఒక స్థానానికి ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు సోమవారం వెలుగుచూశాయి.
— గుజరాత్లోని విశావదర్, కాడి అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విశావదర్ నియోజకవర్గంలో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే కాడి నియోజకవర్గంలో మాత్రం బీజేపీ విజయం సాధించింది.
— గుజరాత్లోని విశావదర్ సీటు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించి మోదీకి సవాల్ విసిరింది.
— పంజాబ్లోని లుథియానా పశ్చిమ నియోజకవర్గానికి జరిగిన ఉప పోరులో అధికార ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఆప్ అధినేత కేజ్రీవాల్కు బలం చేకూరినట్టు అయింది.
— కేరళలోని నిలంబూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఓడిపోగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థి ఆర్యదాన్ షౌకత్ విజయం సాధించారు.
— పశ్చిమ బెంగాల్లోని కాళిగంజ్ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. వాస్తవానికి ఇక్కడ విజయం సాధించేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నం చేసింది. అయినా విజయం చేరువ కాలేదు. పైగా, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates