ఏపీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంతకంతకూ బలోపేతం అవుతోంది. నాణ్యమైన విద్యతో పాటు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలకు దీటుగా సర్కారీ విద్యాలయాలను కూటమి సర్కారు ఎంతో అభివృద్ధి చేస్తోంది. ఫలితంగా ఏడాది వ్యవధిలోనే ఏపీలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పాలి. మొన్నటికి మొన్న టెక్కలి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ‘నో మోర్ సీట్స్’ అని బోర్డు పెడితే… ఇప్పుడు నెల్లూరులోని ప్రభుత్వ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో కూడా ‘అడ్మిషన్స్ క్లోజ్డ్’ అనే బోర్డు దర్శనమిస్తోంది. ఈ ఫొటోను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా టీడీపీ సీనియర్ నేత, మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కొనసాగుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి సర్కారు కొలువుదీరిన మరుక్షణమే నారాయణ ఓ బృహత్కార్యానికే శ్రీకారం చుట్టారు. బాల్యంలో తాను విద్యనభ్యసించిన వీఆర్ మునిసిపల్ ఉన్నత పాఠశాలను ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దాలని తీర్మానించారు. రెండున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పాఠశాల రూపురేఖలు నారాయణ వల్ల ఏడాదిలోనే పూర్తిగా మారిపోయాయి. ఉపాధ్యాయుల కొరత అనేది కూడా లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఇదే విషయాన్ని నగరంలో సదరు పాఠశాల ఉపాధ్యాయులు బాగానే ప్రచారం చేసినట్టున్నారు. పాఠశాలను అలా వచ్చి చూసిన వారంతా తమ పిల్లలను ఈ స్కూల్ లోనే చదివించాలని ఓ తీర్మానానికి వచ్చేశారు. అనుకున్నదే తడవుగా అడ్మిషన్లు తీసుకున్నారు. ఇలా విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి ముందే దాదాపుగా 90 శాతం సీట్లు భర్తీ అయిపోయాయి. ఇక విద్యా సంవత్సరం మొదలయ్యాక మిగిలిన 10 శాతం సీట్లు హాట్ కేకుల్లా భర్తీ అయిపోయాయి. వెరసి ఇప్పుడు ఆ స్కూల్ ముందు ‘అడ్మిషన్స్ క్లోజ్డ్’ అంటూ బోర్డు దర్శనమిస్తోంది.
ఇదే విషయాన్ని ప్రస్తావించిన లోకేశ్… ఏపీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఉన్నత శిఖరాలకు చేరుతుందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. అంతేకాకుండా వీఆర్ మునిసిపల్ ఉన్నత పాఠశాలను కేవలం ఏడాది కాలంలోనే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటుగా అందులో పిల్లలు తండోపతండాలుగా చేరేలా కృషి చేసినందుకు ఆయన నారాయణను ప్రత్యేకంగా అభినందించారు. ఏడాదిలోనే ఈ మేర మార్పు వచ్చిందంటే… ఇక భవిష్యత్తులో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates