తెలంగాణ కాంగ్రెస్ లో ప్రత్యేకించి ఓరుగల్లు శాఖలో ఇప్పుడు పెను వివాదరే రేగింది. గురువారం ఎవరి జన్మదినమో తెలియదు గానీ… మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నోట నుంచి అలా అలా దూసుకువచ్చిన మాటలు పెను రచ్చనే క్రియేట్ చేశాయి. ఈ మాటల్లోకి ఇప్పుడు కొండా ప్రత్యర్తి వర్గం దూసుకురావడం, ఆపై సురేఖ నేరుగా బరిలోకి దిగడంతో ఆ రచ్చ కాస్త పరిష్కారం లేని పెను సమస్యగా మారిపోయింది. వెరసి అదేదో సినిమాలో చెప్పినట్లుగా రచ్చస్య, రచ్చోభ్యహ అన్నట్లుగా మారిపోయింది.
కొండా మురళి ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త కాంగ్రెస్ నేతలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, బస్వరాజు సారయ్య, గుండు సుధారాణి, నాయిని రాజేందర్ రెడ్డి, తదితరులపై నేరుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని భ్రష్టు పట్టించిన ఈ నేతలు, ఆ తర్వాత బీఆర్ఎస్ ను కూడా సర్వనాశనం చేసి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చి చేరారని ఆయన అన్నారు. అయినా ఇతర పార్టీల్లోకి వెళ్లిన తాము తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చిన సందర్భంగా ఆయా పార్టీల నుంచి వచ్చిన పదవులను త్యజించి వచ్చామన్న మురళి,.. వలస నేతలు కూడా ఇప్పుడు అదే పని చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మురళి వ్యాఖ్యలపై తీవ్రంగా మనసు నొచ్చుకున్న నేతలంతా శుక్రవారం నాయిని ఇంటిలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మురళి వ్యాఖ్యలను ఖండిచారు. కొండా తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలని తీర్మానించారు. మురళి వ్యాఖ్యలపై ఇక సహించేది లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో ఈ వ్యవహారంలోకి సురేఖ కూడా దిగిపోయారు. కడియం శ్రీహరిని నల్లికుట్ల మనిషిగా అభివర్ణించిన సురేఖ.. మంత్రిగా ఉన్న తన ముందు కూర్చునేందుకు సిగ్గుపడుతున్న శ్రీహరి…తన మంత్రి పదవి ఊడుతుందని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా ఈ వ్యవహారం పతాక స్థాయికి చేరిపోయింది.
ఇక అదే సమయంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కొందరు పరిశీలకులను నియమించామని చెప్పిన మహేశ్… ఆ పరిశీలకులు ఇచ్చే నివేదిక ఆధారంగా తప్పు ఎవరిదైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా పార్టీ నేతలు క్రమశిక్షణను ఉల్లంఘించడం ఇటీవల తరచూ జరుగుతోందన్న మహేశ్.. ఇది మంచి సంప్రదాయం కాదని, నేతలంతా సంయమనం పాటించాలని కూడా ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates