ఎదురు ప్ర‌శ్నిస్తున్న ప్ర‌భాక‌ర్‌రావు!

తెలంగాణ‌లో జ‌రిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ ఎస్ హ‌యాంలో స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ ఐబీ) చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌భాక‌ర‌రావు త‌మ‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు వెల్ల‌డించారు. శుక్ర‌వారం కూడా ఆయ‌న‌ను సుమారు 8 గంట‌ల‌కుపైగానే విచారించారు. వాస్త‌వానికి ఈ నెల‌లో 4 సార్లు విచార‌ణ‌కు పిలిచారు. అమెరికా నుంచి ట్రాన్సిట్ వారెంటుపై హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌.. ఆయ‌న సిట్ అధికారుల ముందు హాజ‌రైన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో అస‌లు ఫోన్ ట్యాపింగ్‌ను ఎవ‌రు చేయ‌మ‌న్నారు? ఎవ‌రెవ‌రి ఫోన్లు ట్యాప్ చేశారు? ఎందుకు చేశారు? దీనివ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంటి? ఎవ‌రికి మేలు చేసేందుకు ఇలా చేశారు? అంటూ.. గ‌త రెండు మూడు విచార‌ణ‌ల సంద‌ర్భంగా ప‌లు అంశాల‌ను సిట్ అధికారులు ప్ర‌శ్నించారు. అయితే.. అప్ప‌ట్లో ప్ర‌భాక‌ర‌రావు నోరు విప్ప‌లేదు. త‌ను మ‌రిచిపోయాన‌ని..గుర్తు లేద‌ని.. ఎవ‌రో చెబితే తాను ఎందుకు చేస్తాన‌ని.. త‌న‌కు చ‌ట్టం తెలియ‌దా? అని ఎదురు ప్ర‌శ్నించిన‌ట్టు సిట్ అధికారులు చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రోసారి ఆయ‌న‌ను విచారించారు. అయితే.. ఇప్పుడు కూడా అధికారులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భాక‌ర్ రావు స‌మాధానాలు దాట‌వేసిన‌ట్టు చెప్పారు.

కోర్టుకు నివేదిక‌..
ప్ర‌భాక‌ర్‌రావు విచార‌ణ నివేదిక‌ను సిట్ అధికారులు కోర్టుకు స‌మ‌ర్పించ‌నున్న‌ట్టు తెలిసింది. దీనిలో ప్ర‌ధానంగా త‌మ విచార‌ణ‌కు ప్ర‌భాక‌ర్‌రావు ఏమా త్రం స‌హ‌క‌రించ‌లేద‌ని స్ప‌ష్టం చేయ‌నున్నారు. త‌ద్వారా ఆయ‌న‌కు కోర్టు క‌ల్పిస్తున్న ఉప‌శ‌మ‌నాల నుంచి విముక్తి క‌ల్పించి.. ఆయ‌న‌ను తాము అరెస్టు చేసి విచారించేలా వెసులు బాటు క‌ల్పించాల‌ని అధికారులు కోర‌నున్న‌ట్టు తెలుస్తోం ది. అయితే.. దీనిపై సిట్ అధికారులు స్పందించాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి ఈ నెల 9, 11, 14, 19 తేదీల్లో వ‌రుస‌గా విచారించారు. 20వ తేదీ శుక్ర‌వారం కూడా సుదీర్ఘంగా విచారించారు. ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ‌లో వ‌చ్చిన స‌మాచారం.. ఇత‌ర నిందితులు ప్ర‌ణీత్‌రావు వంటివారు వెలిబుచ్చిన స‌మాచారం వంటివాటిని ప్ర‌భాక‌ర్‌రావు ముందు పెట్టి.. ప్ర‌శ్నించారు. అయితే.. దేనికీ ప్ర‌భాక‌ర్‌రావు స్పందించ‌లేద‌ని అధికారులు తెలిపారు.