చెవిరెడ్డన్న‌కు జ‌గ‌న్ స‌ర్టిఫికేట్‌

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిని మ‌ద్యం కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు అరెస్టు చేయ‌డంపై మాజీ సీఎం జ‌గ‌న్ స్పందించారు. చెవిరెడ్డి అమాయ‌కు డ‌ని ఆయ‌న స‌ర్టిఫికెట్ ఇచ్చారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగింద‌ని.. దీనిని దారి మ‌ళ్లించేందుకే త‌మ పార్టీ నాయ‌కుల‌ను అరెస్టు చేస్తున్నార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న పార్టీ నేత‌ల అరెస్టు చిట్టాను విప్పారు.

“చెవిరెడ్డన్న‌ అరెస్ట్‌ నిజంగా ఆశ్చ‌ర్యం అనిపించింది. చీమ‌కు కూడా అప‌కారం చేయ‌డం అంటే తెలీదు. అంత అమాయ‌కుడు. అయినా.. ఆయ‌న‌ను అరెస్టు చేశారు. ఇది దారుణం కాదా అని చంద్ర‌బాబును అడు తున్నా” అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. లిక్క‌ర్ కేసులో త‌ప్పుడు స్టేట్‌మెంటు కోసం.. గ‌న్‌మ‌న్ మ‌ద‌న్‌ను తీవ్రంగా హించార‌ని.. ఆయ‌నే చెప్పారని.. దీనిని బ‌ట్టి సిట్ విచార‌ణ ఏ స్థితిలో అడ్డ‌గోలుగా సాగుతోందో అర్ధం చేసుకోవ‌చ్చ‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

“లిక్కర్ కేసులో ఎలాంటి లోపాలు జ‌ర‌గ‌లేదు. కానీ, ఉద్దేశ పూర్వ‌కంగానే కేసులు పెట్టారు. చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకును కేసులో ఇరికించారు.” అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న ప‌లువురి పేర్ల‌ను ఉటంకించారు. నందిగం సురేష్‌, వ‌ల్ల‌భ‌నేని వంశీ, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, మిథున్ రెడ్డిపైనా కేసులు పెట్టార‌న్నారు. చివ‌ర‌కు ఆఫీసును వ‌దిలి బ‌య‌ట‌కు కాలు కూడా పెట్ట‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపైనా కేసు పెట్టార‌ని.. ఇవ‌న్నీ అక్ర‌మం కాదా? అని ప్ర‌శ్నించారు.

చంద్ర‌గిరిలో తంతే..

చంద్ర‌గిరిలో తంతే.. అంటూ.. చంద్ర‌బాబు పై జ‌గ‌న్‌ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్ర‌గిరిలో గెలిచే ద‌మ్ములేక కుప్పానికి పోయాడ‌ని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్ర‌గిరిలో బ‌లంగా ఉన్న ప్ర‌జానాయకుడు కాబ‌ట్టే.. చెవవిరెడ్డి కుటుంబంపై కేసులు పెడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. “వంశీపై 11 కేసులు పెట్టారు. జోగి రమేష్‌ కొడుకు, కాకాణిపై తప్పుడు కేసులు. కృష్ణమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిపైనా అక్రమ కేసులు పెట్టారు” అని జ‌గ‌న్ తెలిపారు. ఇంకా వంద‌ల మందిని అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.