ఆర్జేడీపై ఎంఐఎం దెబ్బ పడిందా ?

ఫలితాలు వచ్చి విశ్లేఫణలు మొదలైన తర్వాత చూస్తుంటే ఆర్జేడీపై ఏఐఎంఐఎం పార్టీ దెబ్బ గట్టిగానే పడిందని అర్ధమైపోతోంది. ప్రస్తుత ఎన్నికల్లో ఎంఐఎం 5 నియోజకవర్గాల్లో గెలిచింది. ఎంఐఎం తరపున 25 నియోజకవర్గాల్లో పోటీ చేసింది మొత్తం ముస్లిం అభ్యర్ధులే అన్నది గుర్తుంచుకోవాలి. మామూలుగా అయితే బీహార్ లో ముస్లిం, యాదవ్ సామాజికవర్గాలు మొదటి నుండి ఆర్జేడీతోనే ఉన్నారు. ఇపుడు కూడా పై సామాజికవర్గాలు ఆర్జేడీతోనే ఉన్నాయి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం స్ధానిక సమీకరణల కారణంగా కొన్ని ఓట్లు ఇతరులకు పోలయ్యాయి. ఇందులో భాగంగానే ఎంఐఎం అభ్యర్ధులు గెలిచారు.

బీహార్ లోని సీమాంచల్ ప్రాంతంలో ముస్లింల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ ప్రాంతంపై ఎంఐఎం వ్యూహాత్మకంగా దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రక్రియ మొదలవ్వటానికి చాలా ముందునుండే అభ్యర్ధులను ఎంపిక చేసింది. వారి విజయానికి చాపక్రింద నీరులాగ ప్రయత్నాలు ప్రారంభించింది. మొత్తం 25 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. అందుకనే స్ధానికంగా ఉండే ముస్లిం సంఘాలతోను, పలుకుబడి ఉన్న వారితో సంప్రదింపులు జరిపింది. అందరి ఆమోదంతో గట్టి నేతలను, వ్యక్తులను రంగంలోకి దింపింది.

అభ్యర్ధులు ఎటూ ముందే నిర్ణయం అయిపోయారు కాబట్టి ప్రచారాన్ని చాలా పకడ్బందీగా చేసుకుంటూపోయింది. ఎక్కడికక్కడ ప్రజల్లోని అసంతృప్తులను పసిగట్టి, ఎన్డీయే, ఆర్జేడీ కూటములపై జనాల్లో ఉన్న వ్యతిరేకతను బాగా క్యాష్ చేసుకుంది. మిగిలిన పార్టీల్లో టికెట్లు ఎవరికి అనే విషయంలో అవస్తలు పడుతుంటే ఎంఐఎం మాత్రం పక్కాగా తమ అభ్యర్ధు ప్రచారంతో నియోజకవర్గాలను ఒకటికి రెండుసార్లు చుట్టేసింది.

పోటీ చేసింది కూడా 25 నియోజకవర్గాలే కావటంతో ప్రచారంలో మంచి ప్రభావం చూపగలిగింది. దాని ఫలితంగానే 5 నియోజకవర్గాల్లో గెలిచింది. గతంలో ఇదే పద్దతిలో మహారాష్ట్రలో నాలుగు నియోజకవర్గాల్లో గెలిచింది. తర్వాత ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కూడా మూడు స్ధానాల్లో గెలిచింది. అంటే దశాబ్దాలుగా కేవలం హైదరాబాద్ లోని ఓల్డ్ సిటికి మాత్రమే పరిమితమైన ఎంఐఎం పార్టీ మెల్లి మెల్లిగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరిస్తోందని అర్ధమవుతోంది.

నిజానికి సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం పోటీలో లేకపోతే అక్కడ ఆర్జేడీనే విజయం సాధించేదనటంలో సందేహం లేదు. గెలిచింది 5 నియోజకవర్గాల్లోనే అయినా ఓడిపోయిన 20 నియోజకవర్గాల్లోని అభ్యర్ధులకు 15 వేలకు పైగా ఓట్లొచ్చాయి. అంటే ఆర్జేడీకి పడాల్సిన ఓట్లన్నీ ఎంఐఎంకు పడిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎంఐఎం పోటీలో లేకపోయినా లేక ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని ఉన్నా ఈపాటికి ఎంజీబీ దే అధికారం అనటంలో సందేహం అవసరం లేదు.