తగ్గేదేలే… 30 సార్లైనా వస్తా: కేటీఆర్

ఫార్ములా ఈ కారు రేసుల కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణకు వెళ్లే మెుందు బీఆర్ఎస్ ఆఫీస్ ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్… విచారణలంటే తనకేమీ భయం లేదని, తమపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇప్పటిదాకా 3 నోటీసులు ఇచ్చారని, తాను ఓ సారి విచారణకు హాజరయ్యానన్న కేటీఆర్… ఇంకా 30 నోటీసులు ఇచ్చినా తాను విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు ఫార్ములా ఈ కారు రేసులను హైదరాబాద్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రేసులకు సంబంధించిన స్పాన్సరర్ నిధులు సమకూర్చుకోవాల్సి ఉన్నా… దానికి విరుద్ధంగా నాటి బీఆర్ఎస్ సర్కారు నిధులను వెచ్చించింది. అందుకు అనుగుణంగా ముందుగా కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసి మరీ కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీనిపై నాటి రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఇంటరెస్ట్ ఏమిటన్న కోణంలో ఆలోచించిన రేవంత్ రెడ్డి సర్కారు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ ను ఓ దఫా విచారించింది.

తాజాగా సోమవారం విచారణకు రావాలంటూ కేటీఆర్ కు గత వారం ఏసీబీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారణకు హాజరయ్యేందుకు ముందు నంది నగర్ లోని తన తండ్రి నివాసానికి వెళ్లిన కేటీఆర్.. కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేసీఆర్ మేనల్డుడు, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా పాలుపంచుకున్నారు. విచారణకు సంబంధించిన వ్యవహారాలపై వారు చర్చించినట్టు సమాచారం. అనంతరం పార్టీ కీలక నేతలతో కలిసి బీఆర్ఎస్ భవన్ కు వెళ్లిన కేటీఆర్ అక్కడ పార్టీ కార్యకర్తలకు అభివాదం తెలిపి.. విచారణకు బయలుదేరారు.

బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి నిర్దేశిత సమయానికే చేరుకున్న కేటీఆర్ వెంట ఆయన న్యాయవాది రామచందర్ రావును మాత్రమే అధికారులు అనుమతించారు. ఇక ఇతర లాయర్లను అనుమతించలేదు. విచారణ జరుగుతుండగా… రామచందర్ రావు అలా దూరంగా కూర్చుని చూస్తూ ఉంటారు. విచారణలో కేటీఆర్ కు ఆయన ఎలాంటి సహకారం అందించరు. ప్రస్తుతం కేటీఆర్ ముగ్గురు ఏసీబీ అధికారులతో కూడిన బృందం విచారిస్తోంది. ఈ విచారణ అనంతరం గతంలో మాదిరే కేటీఆర్ ఇంటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అరెస్టు అన్న మాట అయితే వినిపించలేదు.