నిన్న నోటీసు, నేడు కేసు.. కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిజంగానే ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటిదాకా అధికార పక్షంలో దర్జాగా పాలన సాగించిన కేటీఆర్… విపక్షంలోకి మారిన తర్వాత కూడా ఏమాత్రం స్పీడు తగ్గించకుండానే సాగారు. అధికార కాంగ్రెస్ పై తనదైన శైలి ఆరోపణలతో ఆయన విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు వరుసగా ఆయనపై విచారణలు, కేసులు నమోదు అయిపోతున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డికి పరువుకు భంగం కలిగేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ పై ఓ కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం నమోదు చేసిన ఈ కేసు.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు ఆధారంగా నమోదు అయ్యింది. బీఎన్ఎస్ సెక్షన్లు 353(2), 352ల కింద ఈ కేసు నమోదు అయ్యింది. కాళేశ్వరం కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతున్న కీలక సమయంలో సీఎం రేవంత్ ను ఉద్దేశించి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది వెంకట్ ఆరోపణ. ఆ వీడిలో సోషల్ మీడియాలో వైరల్ కాగా వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వాస్తవానికి ఏ విషయంలో అయినా కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏ చర్యకు ఉపక్రమించినా కేటీఆర్ ఘాటుగా స్పందిస్తున్నారు. తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చిన సమయంలోనూ ఆయన రేవంత్ రెడ్డే తనకు నోటీసులు ఇచ్చినట్లుగా అభివర్ణిస్తూ సంచలన ఆరోపణలు గుప్పించారు. తాజాగా ఏసీబీ రెండో దఫా నోటీసులు ఇచ్చిన తీరుపైనా కేటీఆర్… రేవంత్ కు సవాల్ విసిరారు. లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమని, మీరు కూడా సిద్ధమేనా? అని ఆయన నేరుగా రేవంత్ నే ప్రశ్నించి కలకలం రేపారు.

సీఎంపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై కేటీఆర్ పై కేసు నమోదు కావడానికి ఓ రోజు ముందుగా ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో మరోమారు తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అదికారులు కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్పందించేలోగానే ఆయనపై ఏకంగా కేసే నమోదు అయిపోయింది. ఇలా ఓ వైపు విచారణ, మరోవైపు కేసులతో కేటీఆర్ నిజంగానే ఉక్కిరిబిక్కిరి కాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.