అదేంటో గానీ రాజకీయాల్లో అనుకుంటే ఏదైనా సాధ్యమే. కాదనుకుంటే ప్రతిదీ దుస్సాధ్యమే. నిజమే మరి.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. పార్టీలో ఉంటూ పార్టీ పరువు తీసేలా వ్యవహరించారంటూ నోటీసులు ఇచ్చిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ… ఆ తర్వాత ఆయనపై ఏకంగా బహిష్కరణ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ ను మల్లన్న పెద్దగా పట్టించుకున్నట్లే లేరు. ఎందుకంటే తన పనేదో తాను చేసుకుని పోతూనే ఉన్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కీలక మంత్రులు పాల్గొన్న బహిరంగ వేదికపై వారితో కలిసి కనిపించి ఆయన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
శుక్రవారం సీఎం రేవంత్ ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రేవంత్ తో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితర కీలక నేతలు హాజరయ్యారు. ఈ సభకు ఎమ్మెల్సీ హోదాలో మల్లన్న కూడా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి సభా వేదికను ఎక్కగానే… జ్యోతి ప్రజ్వలనకు బయలుదేరగా… అప్పటికే వేదిక మీదకు చేరుకుని వేచి చూస్తున్న మల్లన్న సీఎంను చూసి అభివాదం చేశారు. సీఎం కూడా ఆయన భుజంపై చేయి వేసి ఇద్దరూ నవ్వుతూ తుళ్లుతూ జ్యోతి ప్రజ్వలనకు వెళ్లారు. వారిని మిగిలిన నేతలు అనుసరించారు.
ఇక జ్యోతి ప్రజ్వలన సమయంలోనూ మల్లన్న సీఎం రేవంత్ పక్కనే నిలుచుని కనిపించారు. కాసేపటికి రేవంత్, మల్లన్న మధ్యకు కోటమిరెడ్డి వచ్చి చేరగా… మల్లన్న కూడా జ్యోతి ప్రజ్వలన చేశారు. కోమటిరెడ్డి చేతిలోని కొవ్వొత్తి తీసుకుని దీపం వెలిగించిన మల్లన్న ఆ తర్వాత ఆ కొవ్వొత్తిని సుఖేందర్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లన్ననే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పక తప్పదు. ఇతరులతో ఎలా ఉన్నా కోమటిరెడ్డిపై మల్లన్న గతంలో ఘాటు విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల కారణంగానే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే శుక్రవారం నాటి కార్యక్రమంలో వీరిద్దరూ పక్కపక్కన్నే నిలబడి కనిపించడం గమనార్హం.