ఏ పధకమైనా ఫీడ్ బ్యాక్ తప్పనిసరి

అధికారంలోకి వస్తున్న ఆయా రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ఏవో కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం… వాటిని వీలయినంత మేరకు కొనసాగించడం, ఆపై తిరిగి ఎన్నికలకు వెళ్లడం… ఇదే ఇప్పటిదాకా మనం చూస్తున్నది. ఇటీవలే ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత కూడా లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేశానని, అయినా తాను ఓడిపోయానంటూ ఆవేదన పడిపోయారు. అంటే ఎక్కడో లెక్క తప్పినట్టే కదా. ఆ తప్పిన లెక్కేమిటంటే… అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలు ఏ మేర సంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని జగన్ పట్టించుకోలేదు.

ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి జగన్ చేసిన తప్పును పునరావృతం చేసేందుకు సిద్ధంగా లేదనే చెప్పాలి. తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలను అమలు చేస్తూనే… ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో దూసుకుపోతోంది. గత కొంత కాలం క్రితం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రవేశపెట్టిన కూటమి సర్కారు… ఆ పథకంపై జనం ఏమనుకుంటున్నారు అన్న ఫీడ్ బ్యాక్ ను సేకరించింది. అంతే జనం అభిప్రాయం మేరకు ఏడాది 3 సిలిండర్లు ఇవ్వనున్న ప్రభుత్వం ఆ 3 సిలిండర్లకు అయ్యే మొత్తాన్ని ఒకే దఫా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

ఇక తాజాగా రేషన్ అక్రమాలకు చెక్ పెట్టే దిశగా వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి తిలోదకాలిచ్చిన కూటమి సర్కారు… గతంలో మాదిరిగానే రేషన్ డీలర్ షాపుల వద్దే సరుకుల పంపిణీని ఈ నెల 1న లాంఛనంగా ప్రారంభించింది. అంతటితోనే కూటమి సర్కారు తన పని అయిపోయిందని అనుకోలేదు. వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే రేషన్ పద్దతి బాగుందా?.. డీలర్ షాపుల వద్ద సరుకుల పంపిణీ బాగుందా? అన్న విషయాలపై సివిల్ సప్లైస్ శాఖ జనం నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తోంది. పనిలో పనిగా డీలర్లు ఇస్తున్న బియ్యం, ఇతరత్రా రేషన్ సరుకుల నాణ్యత కూడా ఎలా ఉందన్న దానిపైనా ఆరా తీయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫీడ్ బ్యాక్ ను త్వరలోనే ఆయన సీఎం చంద్రబాబుకు అందజేయనున్నారు.

వాస్తవానికి ఇళ్ల వద్దే రేషన్ సరుకుల పంపిణీ మంచి పథకమే అయినప్పటికీ అమలులో ఆ పథకం అభాసుపాలైందని చెప్పాలి. ఏదో వాహనాలు కొనేసి యువకులకు అప్పించేసి.. రేషన్ సరుకులు ఇచ్చేసి పంపిణీ చేయండి అంటూ చెప్పేశారు. ఆ తర్వాత అసలు ఈ పథకం ఎలా అమలు అవుతుందన్న దానిపై ఆయన అసలు దృష్టి సారించిన పాపానే పోలేదు. యథా రాజదా తథా ప్రజ అన్నట్లుగా సీఎం పట్టించుకోకుంటే తమకెందుకు అన్నట్లుగా మంత్రులు గానీ, అదికార యంత్రాంగం గానీ ఈ పథకం అమలు తీరును అసలు పట్టించుకోలేదు. ఫలితంగా తొలి వారం, రెండో వారం ఓ మోస్తరుగా సరుకుల పంపిణీ మంచిగానే జరిగినా… ఆ తర్వాత తమ మీద నిఘా లేదని గ్రహించిన వాహనదారులు రేషన్ సరుకులను బ్లాక్ మార్కెట్ కు తెరలించే దిశగా సాగారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.