టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును నాటి వైసీపీ సర్కారు అరెస్టు చేసిన ఫలితం… కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. బాబు అరెస్టుతో జనం వైసీపీ పాలనపై భయాందోళనలకు గురయ్యారు. ఫలితంగా గంపగుత్తగా టీడీపీ నేతృత్వంలోని కూటమికి ఓట్లు వేసి… రికార్డు మెజారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికీ వైసీపీ గుర్తించనట్లే ఉంది. ఎందుకంటే… ఇప్పటికీ ఆ పార్టీకి చెందిన కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. అందులో భాగంగానే శనివారం వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తలచుకుని ఉంటే… బాబు రెండోసారి కూడా అరెస్టు అయ్యేవారని ఆయన అన్నారు.
అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు అయిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో సజ్జల శనివారం నెల్లూరు జైలులో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడిన సందర్భంగా సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ అనుకుని ఉంటే చంద్రబాబు రెండోసారి కూడా అరెస్టు అయ్యేవారన్న సజ్జల… తామేమీ కక్షపూరిత రాజకీయాల జోలికి వెళ్లలేదని చెప్పారు. అయితే ఇప్పటి కూటమి ప్రభుత్వం మాత్రం విపక్షాలకు చెందిన బలమైన నేతలను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ అరెస్టులు చేస్తోందని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో వైసీపీకి బలమైన నేతగా ఉన్న కాకాణిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఉంటే… తామేదో ఊరకే అలా మాటలు చెబుతున్నారులే అని అకున్నామని సజ్జల వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే కూటమి సర్కారు రెడ్ బుక్ రాజ్యాంగాన్నే అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రత్యర్థులను ఏదో ఒక రూపంలో వేధించి, అరెస్టులు చేసి వారిని బలహీనం చేయడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని ఆయన విరుచుకుపడ్డారు. కూటమి సాగిస్తున్న రాక్షస పాలనతో వైసీపీ బక్కచిక్కిపోతుందని ఆ పార్టీల నేతలు భావిస్తున్నారని…అయితే అందుకు విరుద్ధంగా కూటమి ఎంత నిర్బంధ పాలన సాగిస్తే…వైసీపీ అంత బలం పుంజుకుంటుందని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్నాయి.