బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ ఎపిసోడ్లో కీలక సస్పెన్స్ దాదాపు తేటతెల్లమైంది. ఆమె ఎవరిని కార్నర్ చేస్తున్నారో.. ఎవరిని ఉద్దేశించి లేఖలు సంధించారో.. కూడా దాదాపు స్పష్టమైంది. పైగా.. ఆమె కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని మాత్రమే చెప్పి ఉంటే.. వేరేగా ఉండేది. కానీ, వేరేవారి నాయకత్వంలో పనిచేయను అని కుండబద్దలు కొట్టేశారు. అంటే.. ప్రస్తుతం జరుగుతున్న బీఆర్ ఎస్ నాయకుల చర్చల ప్రకారం.. రేపో మాపో కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పగించనున్నారని సమాచారం.
దీనిని ఆమె పరోక్షంగా తిప్పికొట్టేశారు. నేను కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తా.. వేరేవారి నాయకత్వంలో పనిచేయను అంటే.. కవిత రాజకీయ లక్ష్యం.. కేటీఆర్ అన్నది సుస్పష్టంగా తెలుస్తోందని అంటు న్నారు పరిశీలకులు. నిజానికి ఇప్పటి వరకు అనేక ఊహాగానాలు తెరమీద ఉన్నాయి. కానీ, ఇప్పుడు కవిత మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాల ప్రకారం.. ఆమె ఎవరిని టార్గెట్ చేసుకున్నారో నూటికి నూరు పాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పైగా విదేశాల్లో సోషల్ మీడియా వింగులు పెట్టారని.. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అచ్చం కేటీఆర్ గురించే. ఇక, కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన తర్వాత. కేవలం పోస్టులకు మాత్రమే పరిమితయ్యారన్నా.. అది కేటీఆర్ను ఉద్దేశించే. ఎందుకంటే.. ఆయనే తొలుత కేటీఆర్కୁ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ.. ట్వీటు పెట్టారు. మరీ ముఖ్యంగా బీజేపీ నాయకుల ఆసుపత్రులను ప్రారంభించింది ఎవరు? అని ప్రశ్నించిన కవిత అంతరంగాన్ని పరిశీలించినా.. కేటీఆర్ చిత్రం కనిపిస్తుంది.
సో.. కవిత సినిమాలో ఇప్పటి వరకు కొనసాగిన సస్పెన్స్కు దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇక, ఇప్పుడు ఏం జరుగుతుందన్నదే అసలు కథ.. క్లైమాక్స్ ఎలా ఉంటుందన్నదే అసలు ఉత్కంఠ. దీనికి రెండు మార్గాలు ఉన్నాయని అప్పుడే బీఆర్ ఎస్లోనే నాయకులు చర్చిస్తున్నారు. 1) కేసీఆర్ తన బిడ్డలను పిలిచి చర్చించి ఏకగ్రీవ నిర్ణయానికి రావడం. 2) పరిస్థితులు సర్దుమణిగే వరకు.. పార్టీని నడిపించడం. అప్పటి దాకా.. కేసీఆర్కు మరో మార్గం లేదని చెబుతున్నారు. మరి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.