రాజకీయాల్లో నాయకులు ఉంటారు. వారికి ప్రత్యర్థులు కూడా ఉంటారు. అయితే.. ఎవరు ఎలాంటి వారు? అనేది తెలుసుకోవడం నాయకులకు.. పార్టీలకు కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయంలో చాలా మంది నాయకులు తప్పులు చేస్తుంటారు. అందుకే.. వెనుకబడి పోతుంటారు. కానీ.. ఈ వ్యవహారంలో రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు స్టయిల్ వేరు. ఆయన దూకుడు వేరు. ఒకరకంగా చెప్పాలంటే.. చంద్రబాబు విశ్వరూపమే వేరు.
ఈ విషయాన్ని జగన్ అంచనా వేయలేకపోతే.. పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతుందని పరిశీలకులు చెబుతున్నారు. చంద్రబాబు అంటే.. కేవలం నాయకుడు.. ఒక పార్టీ అధినేతగానే కాదు.. ఆయన ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో దిట్ట. ప్రచారం చేయడంలో స్కాలర్. ప్రజలను మలుపుతిప్పుకొనే వ్యూహాలు వేయడంలోనూ.. ఆయన నెంబర్ 1. ఇది 2014, 2024 ఎన్నికల్లోనూ.. చంద్రబాబుకు కలిసి వచ్చింది. ఆయన దూకుడు, ప్రచారం వంటివి కలిసివచ్చాయి.
అంతేకాదు.. రాజకీయాల్లో కావాల్సిన మరో కీలక అంశం — పదిమందిని పోగు చేయడం. ఈ విషయంలోనూ చంద్రబాబు సక్సెస్ అయ్యారు. గత తన పాలనలో మేలు జరిగిన వారిని ముందుండి నడిపించారు. వారందరిని ఏకమయ్యేలా చేశారు. సొంత ఖర్చులు పెట్టుకుని ముందుకు ఉరికేలా చేశారు. నాయకులకు నిర్ణీత లక్ష్యాలు విధించారు. ఫలితంగా భారీ ప్రచారం.. భారీ యూటర్న్లు 2024లో స్పష్టంగా కనిపించాయి. మరీ ముఖ్యంగా ప్రత్యర్థి లోపాలను తెలుసుకోవడంలోనూ చంద్రబాబు సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. వైసీపీ అధినేత జగన్కు పార్టీ వర్గాల నుంచి అందిన నివేదికల్లో ఓ కీలక నాయకుడు.. ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రచార వ్యూహంలోనూ.. పార్టీని ప్రజలకు చేరువ చేయడంలోనూ.. జీరో నుంచి ప్రారంభించాలని 2024కు ముందు చంద్రబాబు ఇదేపని చేశారని ఆయన వెల్లడించారు. ఈ విషయంలోనే గత ప్రభుత్వంలో మేలు జరిగిన వారిని ఏకం చేసేలా చర్యలు ఉండాలని సూచించారు. చంద్రబాబు విశ్వరూపాన్ని తక్కువగా అంచనా వేయొద్దని.. కేవలం సింపతీని మాత్రమే నమ్ముకుంటే ఫలితం ఉండబోదని అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.