రేవంత్ వ‌ర్సెస్ కేటీఆర్ మ‌ధ్య‌లో బీజేపీ

గ‌త కొద్దికాలంగా మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించ‌కుండా త‌న ప‌ని తాను చేసుకుపోవ‌డం అన్న‌ట్లుగా సాగుతున్న ఫైర్‌బ్రాండ్ నేత‌, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా మీడియా ముందుకు వ‌చ్చి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ బావ‌మ‌రిది పాకాల రాజేంద్ర ప్ర‌సాద్ డైరెక్టర్‌గా ఫార్మా కంపెనీకి రూ. 140 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆరోపించారు. ఆయ‌న డైరెక్టర్‌గా చేరిన ల‌క్సాయ్ లైఫ్ సైన్స్ కొద్ది రోజులకే వందల కోట్లు వచ్చాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ఇప్పుడు హైడ్రాక్సిన్ క్లోరోక్విన్ ఉత్పత్తి కోసం 10వేల కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుందని వ్యాఖ్యానించారు. ఈ సంస్థకు కేంద్రం ఒప్పందం కోసం కేసీఆర్-కేటీఆర్ మధ్యవర్తిత్వం వహించారని, కేంద్రం సైతం స‌హ‌క‌రించార‌ని ఆరోపించారు.

అయితే, దీనిపై కరీంనగర్ ఎంపీ,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ బావ‌మ‌రిది పాకాల రాజేంద్ర ప్ర‌సాద్ డైరెక్టర్‌గా ఉన్న ఓ ఫార్మా కంపెనీకి కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇవ్వ‌డంలో అవినీతి , అక్ర‌మాలు జరుగుతున్నాయని ఏవైనా ఆధారాలుంటే ఇవ్వాలని సంజ‌య్ డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా పిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామ‌న్నారు. కేంద్రం తరపున విచారణ జ‌రిపిస్తామని తెలిపారు. ఏ ఆధారాలు ఉన్నా ఇవ్వాల‌ని, చర్యలు తీసుకునే విష‌యంలో ఎలాంటి అనుమానం లేద‌న్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటా? కాదా? అనేది ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారని ఈ విష‌యంలో రేవంత్ స్వీయ విమ‌ర్శ చేసుకోవాల‌ని సూచించారు.

బంధుత్వం పేరుతో కేసీఆర్-కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి అర్హత లేని కంపెనీలతో ఒప్పందం చేయడంపై బీజేపీ సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అనుభవం లేని సంస్థతో ఒప్పందం చేసుకుంటే బీజేపీ-టీఆరెస్ అంతర్గత కుమ్మక్కు అయినట్లు అర్థం అవుతుందని అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దలు వ్యాపారం చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి? అని రేవంత్ ప్ర‌శ్నించారు.