టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయాల పై కొంత గడబిడ.. తాత్సారం రెండూ ఉంటాయని పార్టీ నాయకులు చెబుతారు. ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. సుదీర్ఘ సమయం తీసుకుంటారు. చాలా కోణాల్లో ఆచి తూచి అడుగులు వేస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా.. ముందు వెనుకలుకూడా ఆలోచించు కుంటారు. అందుకే నాయకులు “అమ్మో.. బాబుగారి నిర్ణయమా? అయితే ఏడాదైనా పడుతుంది!” అని సరదా వ్యాఖ్యలు చేస్తారు. ఇది సహజమే.
వాస్తవానికి చంద్రబాబు అంటే.. దుందుడుకు నిర్ణయాలు తీసుకుని.. చేతులు కాల్చుకునే టైపు కాదు. కాబట్టి.. ఆయన టైం తీసుకోవడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కాకపోతే.. ఒకింత వేచి చూడలేని వారు మాత్రం నసుగు తారు. అంతే!!. తాజాగా మంత్రి నారా లోకేష్ విషయంలోనూ చంద్రబాబు నాన్చుడు ధోరణినే అవలంభించినా.. సరైన నిర్ణయం దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారన్నది పార్టీ సీనియర్లు చెబుతు న్న మాట. ఇప్పటి వరకు లేని.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించనున్నారు.
దీనిని నారా లోకేష్కు అప్పగించనున్నారని చర్చ సాగుతోంది. మంగళవారం నుంచి ప్రారంభమైన మహా నాడులో ఇది కీలక అంశంగా మారింది. అయితే.. కొన్ని వర్గాలకు మాత్రమే లీకులు వచ్చాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. వాస్తవానికి ఈ నిర్ణయం గత మహానాడునాడే తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ, బాబు వాయిదా వేశారు. ఇక, ఇప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయమ ని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. దీనికి 4 కారణాలను వారు చెబుతున్నారు.
1) ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి పై చంద్రబాబు దృష్టి పెట్టాలి. తద్వారా పార్టీపై ఎక్కువ సేపు కాన్సన్ట్రేట్ చేసే సమయం ఉండదు. కాబట్టి.. నారా లోకేష్కు ఇప్పుడు పదవి ఇవ్వడమే బెటర్ అన్నది బాబు అభిప్రాయం.
2) పార్టీ పై పట్టు సంపాయించినప్పటికీ.. మరింత ఎక్కువగా నారా లోకేష్ పట్టు సాధించేందుకు ఇప్పుడు కీలక పదవిని అప్పగిస్తే.. వచ్చే నాలుగేళ్లనాటికి సమయం సరిపోతుంది. తద్వారా ఆయన వచ్చే ఎన్నికల నాటికి పుంజుకునే అవకాశం ఉంటుంది.
3) వయసు రీత్యా చూసుకున్నా.. చంద్రబాబుకు ఇప్పుడు 75 సంవత్సరాలు. కాబట్టి.. ఇది ఒకరకంగా.. సరైన సమయం. ఒకవేళ తేడా వచ్చినా.. తాను తిరికి హ్యాండిల్ చేయడానికి కావాల్సినంత సమయం ఉంటుంది. తప్పుఒప్పులు సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
4) వచ్చే ఎన్నికల నాటికి యువత పెరిగే అవకాశం ఉన్నందున వారిని మొబిలైజ్ చేసి.. వారి ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు నారా లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇప్పుడు కట్టబెట్టడమే బెటర్ అన్న అభిప్రాయం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే.. ఇదే సరైన సమయమని ఆయన భావిస్తున్నట్టు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.