బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తనయ.. కవిత రాసిన లేఖ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ దుమారం తాలూకు రాజకీయం ఇంకా కొనసాగుతోంది. పంతం నీదా-నాదా.. అన్నట్టుగా సాగుతున్న రాజకీయాల్లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వాస్తవానికి కవిత తన తండ్రితో భేటీ అయ్యేందుకు ఎదురు చూస్తున్నారు. లేఖ అనంతరం.. జరిగిన పరిణామాలు కూడా.. కేసీఆర్ ఖచ్చితంగా కవితను పిలుస్తారని.. చర్చిస్తారనే అనుకున్నారు.
కానీ, ఆదివారం మధ్యాహ్నం.. అనూహ్యంగా “రా.. రమ్మంటూ” కేసీఆర్ నుంచి కేటీఆర్ కు ఫోను వచ్చింది. దీంతో కేటీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లి కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో కవిత వ్యవహారం.. పెద్ద ఎత్తున చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై చర్చ పెట్టొద్దని, దీనివల్ల ప్రత్యర్థి శిబిరాలకు రాజకీయ అవకాశం ఇచ్చినట్టు అవుతుందని కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం జరిగిన యాగీ చాలని.. దీనిని పెంచుకుంటూ పోవద్దని సూచించారని తెలిసింది.
లేఖ విషయాన్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. తాను చూసుకుంటానని కేసీఆర్ తేల్చి చెప్పారు. అంతేకాదు.. దీనిపైనే రాజకీయాలు చేసుకుంటూ పోతే.. సరికాదని కూడా స్పష్టం చేసినట్టు సమాచారం. అంతర్గత విషయాలపై చర్చించేందుకు బహిరంగ వేదికలు కీలకం కావడానికి వీల్లేదని కూడా కేసీఆర్ తేల్చి చెప్పినట్టు సమాచారం. టీవీ డిబేట్లు, ఇతరత్రా మీడియా సమావేశాల్లోనూ.. నాయకులు ఎవరూ లేఖపై మాట్లాడొద్దని చెప్పారు.
ఈ మేరకు ఓ ప్రకటన చేయాలని కేటీఆర్కు తేల్చి చెప్పారు. ఇక, మరో వారం రోజుల్లో జరగాల్సిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై పార్టీ తరఫున నిర్వహించాల్సి న కార్యక్రమాలకు సంబంధించి కేటీఆర్కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయా లలోవేడుకలకు శ్రీకారం చుట్టాలని.. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రజలకు వివరించాలని కూడా కేసీఆర్ వివరించారు.