నిజమే… అనంతపురంలో బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోను పీకి పారేసిన టీడీపీ ఎమ్మెల్యేలు… దాని స్థానంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫొటో పెట్టారు. బాబు ఫొటో పక్కనే భారత జాతిపిత మహాత్మా గాంధీ ఫొటోను కూడా పెట్టారు. ఈ ఘటన నగరంలోని జిల్లా పరిషత్ భవన సముదాయంలోని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఛాంబర్ లో చోటుచేసుకోగా… జగన్ ఫొటో పీకివేత సందర్భంగా ఒకింత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
సాధారణంగా ఏదేనీ రాష్ట్రం పరిధిలోని జిల్లాలు, మండలాలు, ఇతరత్రా స్తానిక సంస్థల కార్యాలయాలు, చివరాఖరుకు ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నేత ఫొటో ఉంటుంది. ఆయా నేతలు, అదికారులు మరింత దేశభక్తులు అయితే భారత జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోలను కూడా గోలకు వేలాడదీసి నిత్యం వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. అయితే ఏపీలో వైసీపీ పాలన ముగిసి కూటమి పాలన ప్రారంభమై అప్పుడే ఏడాది కావస్తోంది. అయినప్పటికీ అనంత జడ్పీ చైర్ పర్సన్ కార్యాలయంలో మాత్రం ఇంకా జగన్ ఫొటోనే ఉంది. చంద్రబాబు ఫొటోను అక్కడి అదికారులు ఓ మూలన పడేశారు.
అనంత జడ్పీ పీఠంపై వైసీపీకి చెందిన గిరిజమ్మ కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అప్పటిదాకా దాదాపుగా గిరిజమ్మే జడ్పీ చైర్ పర్సన్ గా కొనసాగనున్నారు. అయితే ప్రభుత్వం మారిన వెంటనే సీఎం ఫొటోను మార్చమంటూ చంద్రబాబు ఫొటోను కూడా ఆమె కార్యాలయ సిబ్బందికి అందజేశారు. దానిని గిరిజమ్మ మాత్రం మార్చనీయలేదట. తమ పార్టీ అదినేత జగన్ ఫొటోను పీకడానికి ఇష్టపడని గిరిజమ్మ… బాబు ఫొటోను మాత్రం ఓ మూలన పడేశారు. సాధారణంగా ప్రత్యర్థి పార్టీ నేతల అదీనంలోని కార్యాలయాల్లోకి అదికార పార్టీ నేతలు అయినా పెద్దగా వెళ్లరు కదా. అనంతలోనూ అదే జరిగింది.
బుధవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగగా… దానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యేలు అలిమినేని సురేంద్ర బాబు, ఎంఎస్ రాజు, దగ్గుమాటి వెంకటేశ్వర ప్రసాద్ లకు అనూహ్యంగా చంద్రబాబు ఫొటో స్టోర్ రూమ్ పక్కగా కింద కనిపించింది. గోడకు ఠీవీగా వేలాడాల్సిన బాబు ఫొటో ఇలా స్టోర్ రూమ్ పక్కన పారేసి ఉందేమిటంటూ వారు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడగా.. ఏడాది గడుస్తున్నా జగన్ ఫొటోను మార్చకపోవడంపై వారు జడ్పీ సీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్ పర్సన్ ఛాంబర్ లోకి దూసుకెళ్లి మరీ జగన్ ఫొటోను పీకి పారేసి.. దాని స్థానంలో చంద్రబాబు ఫొటోను, దాని పక్కన గాంధీ ఫొటోను పెట్టారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ వారిని అడ్డుకునేందుకు యత్నించగా… టీడీపీ ఎమ్మెల్యేలు ఉగ్రరూపం చూపడంతో వెనక్కు తగ్గారు.