టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. గురువారం రాత్రి నుంచి మొదలు కానున్న ఆయన హస్తిన టూర్ శుక్ర, శనివారాల్లో కూడా కొనసాగనుంది. ఈ టూర్ లో చంద్రబాబు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఓ కీలక భేటీ నిర్వహించనున్నారు. శుక్రవారం జరగనున్న ఈ భేటీలో ఏపీకి సంబంధించి ఓ కీలక పరిణామానికి కేంద్రం నుంచి చంద్రబాబు అనుమతి తీసుకుంటారన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. మద్యం కుంభకోణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టు, తదనంతర పరిణామాలపైనే ఈ భేటీలో కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం.
వైసీపీ హయాంలో మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగగా…అందులో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయంటూ ఆరోపణలు వచ్చాయి. వాటిపై కూటమి సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి మరీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలో కుంభకోణంలో కీలక భూమిక పోషించిన వారందరినీ దాదాపుగా సిట్ అరెస్టు చేసింది. వీరిలో కీలక నిందితులు అయిన కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిలను సిట్ అదికారులు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ విచారణతో పాటు ఇతర నిందితుల విచారణలోనూ అన్ని వేళ్లూ జగన్ వైపే చూపుతున్నట్లుగా సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణం ముడుపుల అంతిమ లబ్ధిదారు జగనేనని కూడా నిందితులు చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జగన్ అరెస్టు తప్పదన్న వాదనలు అంతకంతకూ పెరిగపోగా…వైసీపీ శ్రేణులు కూడా జగన్ అరెస్టు తప్పదని దాదాపుగా ఓ అంచనాకు వచ్చాయి. అదే సమయంలో మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలోనూ చంద్రబాబు మద్యం కుంభకోణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులెవ్వరూ దీనిపై బయట మాట్లాడవద్దని, అనవసర రాద్ధాంతం తీసుకురావద్దని సూచించారు. ఈ వ్యాఖ్యలతోనే జగన్ అరెస్టుకు రంగం సిద్ధమైపోయినట్టు విశ్లేషణలు వెలువడ్డాయి. ఓ మాజీ సీఎం, ఓ పార్టీ అదినేతగా ఉన్న జగన్ ను అరెస్టు చేయాలంటే కేంద్రానికి మాటమాత్రంగా అయినా చెప్పాలి కదా. అందులోనూ కేంద్రంలోనూ కూటమి సర్కారే కొలువుదీరి ఉంది.
ఈ క్రమంలోనే ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకున్న చంద్రబాబు.. షెడ్యూల్డ్ నీతి ఆయోగ్ సమావేశానికంటే ముందుగానే అమిత్ షాతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం అమిత్ షాతో భేటీ కానున్న చంద్రబాబు..మద్యం కుంభకోణానికి సంబంధించిన సమగ్ర వివరాలను ఆయన ముందుపెట్టనున్నారు. అంతేకాకుండా మద్యం కుంభకోణంలో ప్రభుత్వ ధనంతో పాటు ప్రజారోగ్యాన్ని జగన్ అండ్ కో ఏ రీతిన నిర్వీర్యం చేశారన్న విషయాన్ని కూడా అమిత్ షాకు వివరించనున్నారు. మద్యం ముడుపులన్నీ తాడేపల్లి ప్యాలెస్ కే చేరినట్టుగా పక్కా ఆధారాలను కూడా ఆయన షా ముందు పెట్టనున్నట్టు సమాచారం. వెరసి జగన్ అరెస్టు కోసం అమిత్ షా నుంచి అనుమతి తీసుకోవడమే ఈ దఫా చంద్రబాబు టూర్ ముఖ్య ఉద్దేశ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.