ఆ యూట్యూబర్ అమాయకురాలు కాదు

పాకిస్థాన్‌కు దేశ రహస్యాలు అందజేస్తోందంటూ జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్‌ను తాజాగా హరియాణా పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇండియా, పాకిస్థాన్ మధ్య గత కొన్ని వారాలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని చిన్నపాటి యుద్ధం కూడా జరిగిన నేపథ్యంలో ఈ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. డానిష్ అనే పాకిస్థాన్ హై కమిషన్‌కు చెందిన అధికారితో జ్యోతి సంబంధాలు కలిగి ఉందని.. ఆమె దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంతర్గత సమాచారాన్ని అందజేసిందని ఆరోపణలు వచ్చాయి.

ఐతే ఒక యూట్యూబర్ అంత పని ఎందుకు చేస్తుందని.. దేశ రహస్యాలను పంచుకునే స్థాయికి ఆమెకు ఉంటుందా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. మన వాళ్లు పాకిస్థాన్ వాళ్లతో స్నేహం చేయడం.. ఆ దేశానికి వెళ్లడం కొత్తేమీ కాదని.. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ఇది నేరంగా అనిపిస్తుండొచ్చని వీళ్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ జ్యోతి గత ఏడాదిగా ఏం చేసిందో తెలిస్తే ఆమె అమాయకురాలు కాదని అర్థమవుతుంది. నిన్నట్నుంచి వైరల్ అవుతున్న పాత ట్వీట్‌ను గమనిస్తే జ్యోతి వ్యవహారం అంత తేలికైందేమీ కాదని తెలుస్తుంది. తను ఐఎస్ఐ ఏజెంట్ అనే ఆరోపణల్లో నిజం లేకపోలేదనే అనిపిస్తుంది.

ఏడాది కిందట కపిల్ జైన్ అనే వ్యక్తి జ్యోతిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశాడు. ఆమె పది రోజుల కిందటే పాకిస్థాన్ ఎంబసీ ఫంక్షన్లో పాల్గొందని, అలాగే పాకిస్థాన్‌కు కూడా వెళ్లి వచ్చిందని.. ఇప్పుడు కశ్మీర్‌కు వెళ్తోందని.. ఈమె మీద ఒక కన్నేసి ఉంచాలని ఏఐఏకు అతను సూచించాడు. యూట్యూబ్‌లో 3 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగిన జ్యోతి తాను ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇండియాలో పాకిస్థాన్ దౌత్య అధికారులతో వేడుకల్లో పాల్గొన్న వీడియో, అలాగే పాకిస్థాన్‌ను సందర్శించినప్పటి వీడియోలు, అలాగే కశ్మీర్‌ పర్యటన తాలూకు వీడియోలను పంచుకుంది. ఈ వీడియోలన్నింటినీ కనెక్ట్ చేసి చూస్తే ఆమె తీరు అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. పోలీసులు ఆషామాషీగా ఏమీ ఆమెను అరెస్ట్ చేయలేదని అర్థమవుతోంది.