సుజనాకు బాబు పరామర్శ… ఏం జరిగింది?

టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్ లో బీజేపీ కీలక నేత, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా శరీరాన్ని శాలువాతో కప్పుకుని వచ్చిన సుజనాను బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబు అడగడంతో తన శాలువాను కుడి చేతిపైకి ఎత్తి చూపుతున్న సుజనా అందులో కనిపిస్తున్నారు.

పూర్వాశ్రమంలో సుజనా కూడా టీడీపీ నేతగానే ఉన్నారు. అసలు ఆయన టీడీపీతోనే రాజకీయం మొదలుపెట్టారు. ఫక్తు వ్యాపార వేత్త అయిన సుజనా… చంద్రబాబు అడుగులో అడుగులు వేస్తూ రాజకీయాల్లో ఎదిగారు. టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో తన లెక్కలేవో తాను వేసుకున్న సుజనా… టీడీపీకి చెందిన మరో ముగ్గురు ఎంపీలతో కలిసి బీజేపీలో చేరిపోయారు. అయితే బీజేపీలో చేరినా ఆయన నిత్యం బాబుతో టచ్ లోనూ ఉంటున్నారు..

అయినా ఇప్పుడు సుజనాను బాబు ఎందుకు పరామర్శించాల్సి వచ్చిందంటే.. వ్యాపార పనులో, వ్యక్తిగత పనులో తెలియదు గానీ… ఇటీవలే సుజనా లండన్ వెళ్లారు. ఆ టూర్ లో ఓ షాపింగ్ మాల్ కు వెళ్లిన సుజనా… పట్టుతప్పి కింద పడిపోయారు. ఈ కిందపడటంలో ఆయన కుడి భుజానికి తీవ్ర గాయమే అయ్యింది. అయితే ఈ గాయానికి లండన్ లో ప్రాథమిక చికిత్స తీసుకున్న సుజనా… పూర్తి స్థాయి చికిత్స కోసం ఉన్నపళంగా హైదరాబాద్ లో వాలిపోయారు.

ఇదంతా జరిగి చాలా రోజులే అవుతోంది. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో సుజనా తన కుడి భుజానికి ఏకంగా సర్జరీనే చేయించుకున్నారు. అనంతరం ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన సుజనా కోలుకుంటున్నారు. ఈ విషయం ఇదివరకే తెలిసిన చంద్రబాబు శనివారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సుజనాను ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు.