-->

‘తెలంగాణ రైజింగ్’కు ‘నోబెల్’ అభిజిత్ సారథ్యం!

అభివృద్ధిలో దూసుకెళ్లేందుకు అన్ని రకాల అవకాశాలు పుష్కలంగా కలిగిన రాష్ట్రంగా తెలంగాణను చెప్పుకోవాలి. అలాంటి రాష్ట్రానికి ఇప్పుడు మరో అదిరిపోయే మద్దతు లభించింది. ఆర్థిక శాస్త్రంలో ప్రఖ్యాత నోబెల్ బహుమతిని అందుకున్న విశ్వ విఖ్యాత ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ తెలంగాణ అభివృద్దికి దిశానిర్దేశం చేయనున్నారు. వెరసి రానున్న కాలంలో తెలంగాణ అభివృద్ధి జెట్ స్పీడుతో దూసుకుపోతుందని చెప్పక తప్పదు.

శనివారం హైదరాబాద్ వచ్చిన అభిజిత్ బెనర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అభిజిత్ బెనర్జీకి సాదర స్వాగతం పలికిన రేవంత్… రాష్ట్ర అభివృద్ధికి అభిజిత్ సలహాలు, సహాయ సహకారాలు కావాలని కోరారు. అంతేకాకుండా… రాష్ట్రంలో వినియోగించుకోవడానికి ఉన్న అపారమైన అవకాశాలను కూడా ఆయన అభిజిత్ ముందు పెట్టారు. రేవంత్ ప్రతిపాదనలను సావధానంగా విన్న అభిజిత్… తెలంగాణ అభివృద్దికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్, సైబరాబాద్ కు అదనంగా ఫ్యూచర్ సిటీ పేరిట ఓ భారీ సిటీకి ప్రణాళికలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీతో పాటుగా ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లుగా రేవంత్… అభిజిత్ ముందే ప్రక్టటించారు. అంతేకాకుండా ఆ బోర్డులో భాగస్వాములు కావాలని కూడా అభిజిత్ ను ఆయన కోరగా… అందుకు అభిజిత్ కూడా అక్కడికక్కడే సరేనని చెప్పేశారు.

అంతర్జాతీయస్థాయి ఆర్థిక వేత్తల సహకారం లభించిన ఆర్థిక వ్యవస్థలు బలంగా అభివృద్ది చెందుతున్న వైనం చూస్తున్నదే. ఇలాంటి నేపథ్యంలో ఆర్థిక శాస్త్రాన్ని ఔపోసన పట్టిన అభిజిత్ బెనర్జీ లాంటి ఆర్థిక వేత్తల తోడ్పాటు లభించడంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా మారినుందని చెప్పొచ్చు. వెరసి ఈ మూడున్నరేళ్లలో రాష్ట్ర అభివృద్ది చిత్ర పటాన్ని రేవంత్ ఓ రేంజిలో మార్చేయడం సాధ్యమేనన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి.