-->

కాకాణి గారూ… ఎంతమందిని ఇరికిస్తారండీ?

వైసీపీ కీలక నేత, జగన్ సెకండ్ కేబినెట్ లో సాగు శాఖ మంత్రిగా కొనసాగిన నెల్లూరు జిల్లా నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే… నిజంగానే ఆశ్చర్యం వేయక మానదు. రెండున్నరేళ్ల పాటు ఓ మంత్రిగా పనిచేసిన నేత సింగిల్ కేసుకు భయపడి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోవడం నిజంగానే ఆశ్చర్యమే కదా. అది కూడా రెండు గడుస్తున్నా కూడా ఆయన అత్తా పత్తా కనిపించడం లేదు. పోలీసులు ఇటు నెల్లూరు, అటు హైదరాబాద్, బెంగళూరుల్లో కాళ్లరిగేలా తిరుగుతున్నా కాకాణి జాడ మాత్రం కనిపించడం లేదు.

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వుకుని సొమ్ము చేసుకున్నారంటూ కాకాణిపై ఇదివరకే కేసు నమోదు అయ్యింది. అయితే వైసీపీ అదికారంలో ఉన్నంత కాలం ఈ కేసు అలా పడిపోయినా… కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినంతనే ఈ కేసుకు రెక్కలు వచ్చాయి. పోలీసులు ఈ కేసు బూజు దులిపి విచారణకు హాజరు కావాలంటూ కాకాణి సహా నిందితులకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల విషయం తెలిసిన వెంటనే కాకాణి దాగుడు మూతలు మొదలుపెట్టారు. ఓ వైపు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతూ…మరోవైపు ముందస్తు బెయిల్ కోెసం కోర్టులను ఆశ్రయించారు. అయితే కోర్టుల్లో ఫలితం లేకపోవడంతో ఆయన అడ్రెస్ లేకుండాపోయారు.

పోలీసుల సహనానికి అయినా ఓ హద్దు ఉంటుంది కదా. ఇప్పుడు అది కూడా దాటిపోయింది. రెండు నెలలకు పైగా సతాయిస్తున్న కాకాణిని ఇక పట్టేయాల్సిందేనని నెల్లూరు జిల్లా ఎస్పీ ఏకంగా నాలుగైదు పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగిపోగా… వారి విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొంతకాలం పాటు హైదరాబాద్ లో తలదాచుకున్న కాకాణి…ఆ తర్వాత తన మకాంను బెంగళూరుకు మార్చినట్లుగా పోలీసులు గుర్తించారు. బెంగళూరులో కాకాణికి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఓ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి అని కూడా పోలీసులు గుర్తించారు. కాకాణి కేసులో ఈ రిటైర్డ్ ఐఆర్ఎస్ అదికారికి కూడా నోటీసులు సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటే… తన ఆచూకీని గోప్యంగా ఉంచుకునే క్రమంలో కాకాణి తన కుటుంబ సభ్యులతో ఫోన్ గానీ, వాట్సాప్ కాల్ గానీ చేయడం లేదట. అయితే సుప్రజ అనే ఓ మహిళ బ్యాంకు ఖాతాలో ఉన్నట్టుండి కోట్లాది రూపాయల నిధులు జమ కావడం, విత్ డ్రా కావడాన్ని గుర్తించిన పోలీసులు… ఆ మహిళను విచారించేందుకు వెళ్లగా ఆమె సహకరించలేదట. దీంతో ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు యత్నించగా… ఆమె నోటీసులు కూడా తీసుకోలేదట. పలితంగా ఆమె ఇంటి గేటుకు నోటీసుల కాపీని అతికించి వచ్చారట. ఈ మొత్తం వ్యవహారం చస్తుంటే.. కాకాణిని ఏ క్షణాన్నైనా అదుపులోకి తీసుకునే పోలీసులు.. కాకాణికి సహకరించిన వారందరినీ బుక్ చేసే దిశగా సాగుతున్నట్లు సమాచారం.