=

మహానాడులో మార్పు లేదు..

ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు లేవు. ఏటా మే నెల 27 నుంచి మొదలై మూడు రోజుల పాటు కన్నులపండువగా జరుగుతున్న మహానాడును ఈదఫా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నిర్వహిస్తున్నారు. కడప నగరానికి అత్యంత సమీపంలో సీకే దిన్నే మండల కేంద్రంగా జరగనున్న ఈ వేడుకకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం లోకేశ్… పలువురు మంత్రులతో పాటు పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో మహానాడు షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు అవసరం లేదని లోకేశ్ తేల్చి చెప్పారు. పహల్ గాం ఉగ్రదాడి, దానికి ప్రతిగా భారత త్రివిధ దళాలు పాక్ భూభాగం కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యుద్ధం వేళ మహానాడు అవసరమా? అని లోకేశ్ సహా పార్టీ అదినేత చంద్రబాబు కూడా ఆలోచించారు.

అయితే అప్పటికే స్థల ఎంపిక, పరిశీలన, ఏర్పాట్లకు సంబంధించిన ప్రాథమిక చర్యలు మొదలయ్యాయి. అదే సమయంలో భారత భీకర దాడికి తట్టుకోలేని పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతో యుద్ధం దాదాపుగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మహానాడును వాయిదా వేయాల్సిన అసవరం లేదని టీడీపీ భావించింది. అందులో భాగంగానే మహానాడు ఏర్పాట్లకు సంబంధించిన బుథవారం లోకేశ్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మహానాడును యథాతథంగా నిర్వహణకే అందరు నేతలు అంగీకరించారు.

ఇదిలా ఉంటే..మహానాడుకు ముందు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ జిల్లా శాఖలు మినీ మహానాడును నిర్వహించాలని కూడా ఈ సమావేశంలో లోకేశ్ తీర్మానించారు. ఇది కూడా కొత్త పద్దతేమీ కాదు. ఏటా మహానాడు… దానికి ముందుగా జిల్లాల్లో మినీ మహానాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మినీ మహానాడులను ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా కార్యవర్గాలను ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో మహానాడుకు తరలివెళ్లేందుకు సన్నాహక సమావేశాలుగా వీటిని పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.