విధేయత, అణుకువ, పార్టీ అధినేత పట్ల అత్యంత గౌరవ మర్యాదలు ప్రదర్శించి.. విధేయతకు కేరాఫ్గా నిలిచిన మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మక ఆప్కాబ్ చైర్మన్ పదవితో వీరతాడు వేశారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న గన్ని వీరాంజనేయులకు కీలకమైన పదవిని ఇచ్చి ఆయన సేవలను చంద్రబాబు గుర్తించారనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్గా ఇటీవలే నియమించిన ఆయనను కీలకమైన ఆప్కాబ్ చైర్మన్ పదవిని ఇచ్చి పార్టీలో కష్టపడిన వారికి ఎలాంటి ఢోకా ఉండదన్న సంకేతాలు అందించారు.
త్యాగం-కష్టం!
గన్ని వీరాంజనేయులు.. టీడీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ అంటే ప్రాణం పెట్టే ఆయన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినా వైసీపీ హవాలో గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. అయినప్పటికీ 2019-24 మధ్య నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉన్నారు. వివాదాలకు దూరంగా ప్రజల మనిషిగా, నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక, 2024లో పోటీకి సిద్ధమైన నేపథ్యంలో ఉంగుటూరు స్థానాన్ని టీడీపీకి అధినేత జనసేనకు కేటాయించారు.
అయినప్పటికీ గన్ని కుంగిపోలేదు. పార్టీపై విమర్శలు చేయలేదు. పార్టీ అధినేత నిర్ణయమే శిరోధార్యంగా భావించారు. ఆ క్రమంలోనే ఆయన విధేయతను మరింత ఎక్కువగా చూపారు. దీంతో వీలైతే ఎమ్మెల్సీ లేదా మరో ప్రాధాన్యత కలిగిన పదవి ఇస్తామంటూ అప్పట్లో చంద్రబాబు, నారా లోకేశ్ లు గన్నికి పూర్తి భరోసా ఇచ్చారు. అయితే.. కొన్నాళ్లుగా భర్తీ అవుతున్న ఎమ్మెల్సీల స్థానంలో తనకు ఒక్కటైనా దక్కుతుందని అనుకున్నా.. అవి కూడా సాధ్యం కాలేదు. ఈ క్రమంలో గన్నికి పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు బలమైన నామినేటెడ్ పదవి దక్కడం గమనార్హం.
వాస్తవానికి ఆప్కాబ్ చైర్మన్ కావాలంటే ముందస్తుగా డీసీసీబీ చైర్మన్ గా నియమితులు కావాలి. ఈ నేపథ్యంలోనే ఏలూరు డీసీసీబీ చైర్మన్ గా గన్నిని నియమించారు. గన్నికి ఇచ్చిన ప్రాధాన్యం పట్ల పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా వుంటే, నియోజకవర్గంలో కూటమి పార్టీలతో కలుపుగోలుగా ఉండడం.. వివాదాలకు దూరంగా వ్యవహరించడం.. పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహించడం వంటివి గన్నికి కలిసి వచ్చిన పరిణామాలుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆప్కాబ్ చైర్మన్ అంటే.. కేబినెట్ హోదాతో సమానమని అంటున్నారు.