ఈడీ దెబ్బ‌.. వైసీపీలో కుదుపు.. !

వైసీపీ అధినేత జగ‌న్‌కు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్(ఈడీ) దెబ్బ కొత్త‌కాదు. ఆయ‌నకు సంబంధించిన ఆస్తుల కేసులో ఈడీ అనేక మార్లు ఆయ‌న‌ను ప్ర‌శ్నించ‌డం.. ఆయ‌న‌ను జైలుకు కూడా పంపించ‌డం తెలిసిందే. కానీ, ఇత‌ర నాయ‌కుల‌కు మాత్రం ఈడీ దెబ్బ కొత్త‌గానే ఉంది. ముఖ్య‌మంత్రుల‌ను సైతం అరెస్టు చేయ‌గ‌ల శ‌క్తి ఉన్న ఈడీ ఇప్పుడు వైసీపీపై దృష్టి పెట్టింది. జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం లో.. 3 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఈ కేసును ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం విచారిస్తోంది. ఈ క్ర‌మంలో ఆయా వివ‌రాలు త‌మ‌కు ఇవ్వాల‌ని ఈడీ తాజాగా లేఖ రాసింది. ఇక‌, కోరి కోరి కేంద్ర‌మే ముందుకు వ‌స్తే.. ఈ వివ‌రాలు ఇవ్వ‌కుండా.. రాష్ట్ర అధికారులు మాత్రం నీళ్లు న‌ములుతారా? ఈ విష‌యంపై సీఎంవో నుంచి కూడా అధికారుల‌కు ప‌క్కా స‌మాచారం వెళ్లింది. వెంట‌నే సంబంధిత ఆధారాలు.. సాక్ష్యాలు.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన విచార‌ణ తాలూకు వివ‌రాల‌ను ఈడీకి 24 గంట‌ల‌లోనే అందించాల‌ని సీఎం ఆదేశించిన‌ట్టు తెలిసింది.

దీంతో మ‌ద్యం కుంభ‌కోణంలో జ‌రిగిన మ‌నీ లాండ‌రింగ్ వ్య‌వ‌హారంపై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ఆయా వివ‌రాల‌ను ఈడీకీ అందించ‌నుంది. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు వైసీపీనికి కుదిపేస్తోంది. ఇత‌ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు.. ఈడీకి తేడా ఉండ‌డం.. అవ‌స‌ర‌మైతే.. నెల‌ల త‌ర‌బ‌డి కేసును కూపీలాగ‌డం వంటివి జ‌రుగుతాయి. అప్పుడు ఖ‌చ్చితంగా నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఈ వ్య‌వ‌హారంతో ఇప్పుడు మ‌ద్యం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎంపీ మిధున్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుటుంబాలు హ‌డ‌లిపోతున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు తాము ఈడీ కేసులు ఎదుర్కొన‌లేద‌ని.. ఇప్పుడు పెద్ద చిక్కే వ‌చ్చింద‌ని మిధున్‌రెడ్డి త‌న ప‌రివారం ముందు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు.. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారు కూడా.. ఇప్పుడు అప్రూవ‌ర్లుగా మారే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈడీ ఎంట్రీతో జీవితాల‌ను నాశ‌నం చేసుకునేందుకు తాము సిద్ధంగా లేమ‌ని.. దీనిలో ఒక్క‌రూపాయి కూడా తాము తిన‌న‌ప్పుడు.. నిజాలు చెప్పేయ‌డ‌మే బెట‌ర్ అని అంటున్నారు. ఫ‌లితంగా వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.