=

సేఫ్ హౌస్ లోకి పారిపోయిన పాక్ ప్రధాని

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మొదలై రెండు రోజులు కూడా ముగియలేదు…అప్పుడే పాకిస్తాన్ తన అపజయాన్ని అంగీకరించే దిశగా సాగుతోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం తన అధికారిక నివాసాన్ని వదిలి సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. ఇటీవల పహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను బుధవారం తెల్లవారుజామున చేపట్టిన సంగతి తెలిసిందే. తొలుత పాక్ భూభాగంలోకి ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. అయితే బుధవారం పాక్ కవ్వింపు చర్యలు మొదలెట్టింది.

పాక్ కవ్వింపు చర్యలకు దీటుగా సమాధానం చెప్పిన భారత్.. పాక్ మిస్సైళ్లతో పాటుగా ఫైటర్ జెట్లను ఆకాశంలోనూ పేల్చేసింది. అంతేకాకుండా ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ, లాహోర్ వంటి కీలక నగరాల్లోని పాక్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. ఈ దాడులతో పాక్ నిజంగానే భీతిల్లిపోయిందనే చెప్పాలి. గురువారం కూడా పాక్ పలు దాడులు చేసేందుకు యత్నించిన భారత్ వాటిని తిప్పికొట్టింది. కౌంటర్ అటాక్ తోనే పాక్ కు బుద్ధి రాదన్న భావనతో భారత్ తాజాగా అటాక్ ను కూడా షురూ చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో గురువారం రాత్రి పాక్ రాజధాని ఇస్లామాబాద్ లోని పలు ప్రాంతాల్లో బాంబులు పేలాయి. వాటిలో ఓ బాంబు ప్రదాని అధికారిక నివాసానికి అత్యంత సమీపంలో పేలింది. ఈ పేలుడు శబ్ధం పాక్ అదికార యంత్రాంగాన్ని తీవ్రమైన కలవరపాటుకు గుచి చేసింది. ఆ వెంటనే అదికార యంత్రాంగం సూచన మేరకు పాక్ ప్రధాని షరీఫ్ తన సేఫ్ హౌస్ కు మారిపోయారన్న కథనాలు వినిపిస్తున్నాయి. భారత్ తన యుద్ధాన్ని పూర్తి స్థాయిలో మొదలెట్టక ముందే పాక్ లో ఈ తరహా పరిణామాలు చోటుచేసుకున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.