శత్రు దుర్బేధ్యం భారత్… గాల్లోనే పేలిన పాక్ మిస్సైళ్లు

ఓ వైపు పాకిస్తాన్ కుట్రపూరిత వ్యూహాలు, మరోవైపు ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద దాడులు… వెరసి నిత్యం భారత సరహద్దుల వద్ద కాల్పుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నేరుగా భారత్ లోకి చొరబడిపోయి భీకర దాడులకూ పాల్పడుతున్నారు. ఇవన్నీ చూస్తూ కూడా భారత్ ఎందుకంత సహనంతో ఉందని చాలామంది తమను తాము ప్రశ్నించుకుంటూ ఉంటారు. అహింసను నమ్మిన భారత్.. ఓ పరిధిదాకా వేచి చూసే ధోరణినే అవలభిస్తుంది.

ఇప్పుడు ఆ పరిధిని బారత్ దాటేలా పాక్ వ్యవహరించింది. ఇంకేముంది… ఉన్నట్టుండి నడిరేయిలో పాక్ భూభాగంలోని 9 ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడ్డ భారత్ తాను దాడికి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ మరునాడు పాక్ కవ్విస్తూ క్షిపణి దాడులకు దిగితే… పాక్ ప్రయోగించిన మిస్సైళ్లను భారత్ గాల్లోనే పేల్చిపారేసింది. ఈ చర్యతో శత్రువులపై దాడి చేయడమే కాకుండా… తనపైకి దాడికి దిగే వారిని ఎలా నిలువరించగలదో బారత్ చూపెట్టింది.

గురువారం ఇండో పాక్ సరిహద్దుకు సమీపంలోని సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పుర, ఆర్నియా సెక్టార్లను లక్ష్యంగా చేసుకుని పాక్ మిస్సైళ్లను ప్రయోగించింది. అయితే ఈ తరహా ముప్పును ముందే పసిగట్టిన భారత్ సరిహద్దుల్లో తన వద్ద ఉన్న శత్రు దుర్బేధ్య వ్యవస్థను దించేసింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 రక్షణ వ్యవస్థను అత్యంత సమర్ధవంతంగా వినియోగించిన భారత్.. పాక్ క్షిపణులను గాల్లోనే పేల్చి పారేసింది. ఈ దెబ్బతో పాక్ కళ్లు బైర్లు కమ్మాయనే చెప్పక తప్పదు.

ఇక బుధవారం మాదిరే గురువారం కూడా ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు మీడియా ముందుకు వచ్చిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, రక్షణ దళాల ప్రతినిధులు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు.. పాక్ మిస్సైల్ దాడులు…వాటిని భారత్ తిప్పికొట్టిన తీరును ధృవీకరించారు. అంతేకాకుండా భారత్ ఇప్పటిదాకా పాక్ సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు చేయలేదన్న ఖురేషి, సింగ్ లు… శత్రువులను నిలువరించే దిశగానే సాగుతున్నామని తెలిపారు.