‘ఆప‌రేష‌న్ అభ్యాస్’.. స‌క్సెస్‌!

ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడి అనంత‌రం.. భార‌త్-పాకిస్థాన్ దేశాల మ‌ధ్య త‌లెత్తిన ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా దేశ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండి.. తొలుత త‌మ‌ను తాము కాపాడుకునే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం ‘ఆప‌రేష‌న్ అభ్యాస్‌’ పేరుతో మాక్ డ్రిల్‌ను చేప‌ట్టింది. దేశ‌వ్యాప్తంగా 244 కీల‌క జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్‌ను చేప‌ట్టారు. బుధ‌వారం సాయంత్రం 4-4.40 వ‌ర‌కు నిర్వ‌హించిన మాక్ డ్రిల్‌లో ఆయా రాష్ట్రాల‌ పోలీసులు, అగ్నిమాప‌క శాఖ సిబ్బంది, విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగానికి చెందిన సిబ్బంది, వైద్య వ‌ర్గాలు ఇలా అన్ని అత్య‌వ‌స‌ర విభాగాల వారు పాల్గొన్నారు.

దేశంలోని ఎంపిక చేసిన తీర ప్రాంత జిల్లాలు, ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన ఆయుధాల త‌యారీ, భ‌ద్రప‌రిచే జిల్లాలు, జ‌న‌స‌మ్మ‌ర్ధ ప్రాంతాలు ఎక్కువ‌గా ఉన్న న‌గ‌రాలు, జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్‌ను చేప‌ట్టారు. పోలీసు వాహ‌నాలు, అంబులెన్సుల సైరెన్లను మోగించిన క్ష‌ణం నుంచి వాటిని ఆపే వ‌ర‌కు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న‌ది ప్ర‌ధాన సంకేతం. ఈ క్ర‌మంలో ఆయా ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు సైరెన్ల‌ను విన‌గానే వాటిని యుద్ధ వాహ‌నాల సైర‌న్లుగా భావించి.. త‌మ‌ను తాము ర‌క్షించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండ్లు, ఆసుప‌త్రులు, పాఠ‌శాల‌లు.. ఇలా అన్నింటివ‌ద్దా ఎంపిక చేసిన జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వ‌హించారు.

ఏపీలోని విశాఖ‌, బాప‌ట్ల జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వ‌హించారు. అదేవిధంగా తెలంగాణ‌లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ చేప‌ట్టారు. వీటిలో సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌, అల్వాల్‌, గోల్కొండ‌, కాంచ‌న్‌బాగ్‌ల‌లో చేప‌ట్టిన మాక్ డ్రిల్స్‌లో వంద‌ల మంది ఎన్ సీసీ విద్యార్థులు, వ‌లంటీర్లు, పోలీసులు, హోం గార్డులు, ర‌క్ష‌ణ శాఖ సిబ్బంది పాల్గొని అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ప్ర‌జ‌లు ఏవిధంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యాల‌పై ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అదేస‌మ‌యంలో మంట‌ల్లో చిక్కుకున్న‌వారిని, పై అంత‌స్థుల్లో చిక్కుకుని కింద‌కు రాలేని వారిని ఎలా తీసుకురావాల‌న్న దానిపైనా డ్రిల్ చేసి చూపించారు. తాళ్ల సాయంతో కింద‌కు దిగ‌డంపై అవ‌గాహ‌న క‌ల్పించారు.

దేశ‌వ్యాప్తంగా రాజ‌ధాని ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తా, అహ్మ‌దాబాద్‌, గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్, చెన్నై స‌హాప‌లు కీల‌క ప్రాంతాల్లోనూ మాక్ డ్రిల్ నిర్వ‌హించారు. విప‌త్క‌ర ప‌రిస్థితి ఎదురైన‌ప్పుడు ధైర్యం కోల్పోకుండా ఉండ‌డం, తాము సుర‌క్షితంగా ఉంటే.. తోటి వారిని ర‌క్షించే అంశాల‌పైనా ప్ర‌జ‌ల‌కు అధికారులు, సిబ్బంది అవ‌గాహ‌న క‌ల్పించారు. అదేవిధంగా స్వ‌ల్ప గాయాల‌కు ప్ర‌థ‌మ చికిత్స చేసుకునే విధానంపైనా వివ‌రించారు. మొత్తంగా 40 నిమిషాల పాటు సాగిన మాక్ డ్రిల్ ద్వారా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని ర‌క్ష‌ణ రంగ అధికారులు హైద‌రాబాద్‌లో చెప్పారు.