ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి తనను తాను డిఫెండ్ చేసుకోవాలన్నా ఓర్పు-సహనం అత్యంత కీలకం. పహల్గామ్లో జరిగిన దాడి అనంతరం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గత నెల 22న జరిగిన దాడి అనంతరం.. ఒకటి రెండు రోజుల్లోనే భారత్ పాక్కు బుద్ధి చెప్పాలని.. చెబుతుందని కూడా అందరూ అనుకున్నారు.
కానీ, ప్రధాన మంత్రి అలా చేయలేదు. దీంతో కొన్ని రోజులు వేచి చూసిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ కూడా.. ఇంకా మీన మేషాలు లెక్కిస్తారా? అంటూ నిట్టూర్పు వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో ఇతర ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల నుంచి కూడా మోడీపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. మరోవైపు పాకిస్థాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు కూడా దిగింది. అయితే.. వీటన్నింటినీ పంటి బిగువున భరించిన మోడీ.. గత నెల 22 నుంచి నిన్నటి వరకు(మే 6) ప్రపంచ దేశాలను మన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు.
ఫలితంగా.. నాటి మహాభారతంలో పద్మవ్యూహాన్ని ఎలా అయితే సృష్టించారో.. ఇప్పుడు కూడా మోడీ అదే వ్యూహంతో ముందుకు సాగారు. విమర్శలు వచ్చినా.. వాటిపై స్పందించకుండా.. వివేచనతో ముందుకు సాగారు. అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఫస్ట్ విజయం దక్కింది. ఆ తర్వాత.. సాయుధ సంపత్తిని పెంచుకున్నారు. మరోవైపు.. దేశ ప్రజలను, రాజకీయ పార్టీలను కూడా మానసికంగా సిద్ధం చేశారు. ఇదేసమయంలో భారత్ శాంతి కాముక దేశమని.. ఉత్తుత్తునే ఆగ్రహానికి గురి కాదన్న సందేశం ఇచ్చారు.
అంతేకాదు.. భారత్ ఆగ్రహిస్తే.. మేం కూడా ఏమీ చేయలేమన్న భావనను ప్రపంచ దేశాల నుంచి పాక్కు బలంగా వినిపించేలా చేశారు మోడీ. అనంతరం.. అస్త్ర శస్త్రాలతో తొలి విడత పాక్కు దిమ్మదిరిగేలా.. నోట మాట కూడా రాని విధంగా పద్మవ్యూహంలో పాక్ను ఉంచి ఉగ్రవాదంపై ఉక్కు పిడికిలి బిగించారు. ఈ పరిణామాల వెనుక చాలా పెద్ద కసరత్తే జరిగింది. పైకి మోడీ మెత్తని వాడు.. అని అనుకున్నా.. తాజా పరిణామం తర్వాత.. ప్రపంచ దేశాలన్నీ.. మోడీ శభాష్ అని అంటున్నాయి. దటీజ్ భారత్ సత్తా! అని మన వాళ్లు పండగ చేసుకుంటున్నారు.